ఉక్రెయిన్- రష్యా పరస్పరం దాడులు

ఉక్రెయిన్- రష్యా పరస్పరం దాడులు
 
రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడికి పాల్పడింది. ఈ దాడి కారణంగా రెండు కీలక విమానాశ్రయాలను మూసివేసినట్లుగా రష్యా అధికారులు తెలిపారు. భద్రత కోసం వ్నుకోవో, డొమోడెడోవో విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాట్సియా పేర్కొన్నారు.  ఆదివారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో మాస్కో వైపు దూసుకువస్తున్న తొమ్మిది ఉక్రేనియన్‌ డ్రోన్‌లను రష్యా వైమానిక రక్ష విభాగాలు ధ్వంసం చేయాని మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ తెలిపారు. 
ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడితో తులా ప్రాంతంలోని అజోట్‌ కెమికల్‌ ప్లాంట్‌లో స్వల్పకాలిక మంటలు చెలరేగాయని, ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని చెప్పారు.   కలుగ ప్రాంతంలో ఏడు డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రాంతీయ గవర్నర్‌ తెలిపారు. ఈ రెండు ప్రాంతాలు మాస్కోకు దక్షిణంగా, రాజధానికి సరిహద్దుగా ఉన్నాయి. అంతకు ముందురోజు ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలపై రష్యా క్షిపణి, డ్రోన్‌ దాడులతో విరుచుకుపడింది. 
 
ఉక్రెయిన్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ స్పైడర్‌వెబ్‌’కు ప్రతీకారంగా శుక్రవారం రాత్రి ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలను, నగరాలను రష్యా లక్ష్యంగా చేసుకుంది. రష్యా సేనలు 400కు పైగా డ్రోన్లు, 40కి పైగా క్షిపణులను ప్రయోగించాయని, దాడుల్లో ఆరుగురు మరణించారని, మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు తెలిపాయి.  87 డ్రోన్‌, 7 మిస్సైల్‌ దాడుల్ని అడ్డుకున్నామని ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది. డోనెస్క్‌, డైప్రోపెట్రోవిస్క్‌, ఒడెస్సా, టెర్నోపిల్‌ తదితర నగరాలను రష్యా టార్గెట్‌ చేసిందని వెల్లడించింది.