ఐరాస భద్రతా మండలి నుంచి వైదొలగనున్న పాకిస్తాన్

ఐరాస భద్రతా మండలి నుంచి వైదొలగనున్న పాకిస్తాన్
ఈ ఏడాది చివరకు సభ్యత్వం ముగియనుండటంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ వైదొలగనుంది. దానితో ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్య దేశాలకు సంబంధించిన ఓటింగ్ ఈ నెల 3న జరిగింది. దీని ప్రకారం పాకిస్తాన్ సహా ఐదు దేశాలు తమ సభ్యత్వం కోల్పోయి, మరో ఐదు దేశాలు కొత్తగా అడుగుపెట్టబోతున్నాయి.  అందులో ఇస్లాం దేశమైన కిర్గిస్తాన్ భద్రతా మండలిలోకి తొలిసారి అడుగుపెట్టబోతుంది. 
 
దీనితోపాటు ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వేలు రెండేళ్ల కాలపరిమితితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం దక్కించుకున్నాయి.   పాక్‌తోపాటు పనామా, డెన్మార్క్, గ్రీస్, సోమాలియా దేశాలు కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వీటి సభ్యత్వం పూర్తవుతుంది.  కొత్తగా రానున్న దేశాల సభ్యత్వం జనవరి 1, 2027 నుంచి డిసెంబర్ 31, 2028 వరకు కొనసాగుతుంది.
భద్రతా మండలిలో కొత్తగా ఐదు దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. ఇందుకోసం ఏడు దేశాలు పోటీ పడ్డాయి. వీటిలో ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వేలు నాలుగు స్థానాల్లో నిలిచాయి.  మిగిలిన ఒక్క స్తానం కోసం కిర్గిస్తాన్, ఫిలిప్పైన్స్ మధ్య ఉత్కంఠ పోటీ నడిచింది. ఈ రెండు దేశాల సభ్యత్వం కోసం అదనంగా మూడు రౌండ్ల పోటీ నిర్వహించాల్సి వచ్చింది. 
చివరకు కిర్గిస్తాన్ గెలిచి, తొలిసారి సభ్యత్వం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఐదు స్థానాల కోసం పోటీ పడే ప్రతి దేశం కనీస మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలి.  సభ్య దేశాలు ఈ ఓటింగ్‌లో పాల్గొంటాయి. భద్రతా మండలిలో 15 మంది సభ్యులు ఉంటారు. ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. అవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. అంతర్జాతీయంగా దేశాల మధ్య శాంతి భద్రతల్ని కాపాడటానికి, రక్షణ కోసం భద్రతా మండలి పని చేస్తుంటుంది.