దేశంలో ఆరు వేలకు పైగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో ఆరు వేలకు పైగా పెరిగిన కరోనా కేసులు

* ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 65 మంది మృతి

దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది. గత 48 గంటల్లోనే 769 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆరోగ్య శాఖ విడదల చేసిన తాజా డేటా ప్రకారం, కేరళలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్, బెంగాల్, ఢిల్లీలో కేసులు ఎక్కవగా ఉన్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,133లకు చేరింది. గత 24 గంటల్లోనే కరోనా కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 1950, గుజరాత్‌ 822, బంగాల్ 693, దిల్లీ 686, మహారాష్ట్ర 595 కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 81, తెలంగాణలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో వైద్య సౌకర్యాల తనిఖీ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఆక్సిజన్, ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించింది.  కాగా, చాలా కేసులు తేలికపాటివి లక్షనాలు ఉన్నాయని.. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని అధికార వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అంచనా వేసేందుకు జూన్ 2,3 తేదీల్లో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీతా శర్మ అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చర్యలను తీసుకుంటున్నమని ఆమె పేర్కొన్నారు. 

విపత్తు నిర్వహణ సెల్, అత్యవసర నిర్వహణ ప్రతిస్పందన (ఈఎంఆర్) సెల్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సిడిసి), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడిఎస్ పి), ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చర్యలను తీసుకుంటున్నమని వారు పేర్కొన్నారు.