పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్నిభారత్ నిలిపి వేయడంతో ఆ ఒప్పందంపై పునరాలోచన చేయాలని పాకిస్థాన్ కోరుతోంది. ఇప్పటికే భారత్ కు నాలుగు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది. సింధూ నదికి చెందిన నీటిని భారత్ అడ్డుకున్న నేపథ్యంలో పాకిస్థాన్లో నీటి సంక్షోభం మొదలైనట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తూ సింధూర్ ఆపరేషన్ చేపట్టిన తర్వాత కూడా సింధూ జలాల ఒప్పందంపై పాకిస్థాన్ లేఖ రాసినట్లు చెబుతున్నారు.
అయితే ఈ ఒప్పందంపై భారత్ చాలా స్పష్టమైన వైఖరితో వ్యవహరిస్తోంది. ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే విధానంగా ఉండడం కుదరదని భారత్ తేల్చింది. రక్తం, నీళ్లు కూడా ఒకే చోట ప్రవహించదని తేల్చి చెప్పింది. సిందూ జలాల ఒప్పందాన్ని పరస్పర విశ్వాసం, స్నేహం ఆధారంగా రూపొందించారు. కానీ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్థాన్ చర్యలను భారత్ ఖండిస్తోంది. పాకిస్థాన్ నీటి వనరుల శాఖ కార్యదర్శి సయ్యిద్ అలీ ముర్తాజా ఆ లేఖలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ కార్యాలయానికి పంపినట్లు స్పష్టం అవుతున్నది.
ఆ లేఖను మళ్లీ విదేశాంగ కార్యాలయానికి పంపారు. నీటి సంక్షోభాన్ని పరిష్కరించకుంటే ఆకలితో చస్తామని, సింధూ పరివాహక ప్రాంతం తమకు జీవాధారం అని, మూడో వంతు నీళ్లు తమకు దేశం బయటి నుంచి వస్తోందని, సిందూ బేసిన్పై 10లో 9 మంది ఆధారపడుతారని, 90 శాతం పంటలు ఆ జలాలపైనే ఆధారపడుతాయని ఆ లేఖలలో పాకిస్థాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
పవర్ ప్రాజెక్టులు, డ్యామ్లు అన్నీ సింధూ నదిపైనే కట్టారని, మాపై వాటర్ బాంబు పడినట్లు ఉందని, దాన్ని త్వరగా డిప్యూజ్ చేయాలని ఇటీవల పాకిస్థాన్ సేనేటర్ సయ్యిద్ అలీ జాఫర్ తెలిపారు. సింధూ, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ నదులకు చెందిన నీటిని వాడుకునేందుకు 1960లో సింధూ జలాల ఒప్పందాన్నిఏర్పర్చుకున్నారు.
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నమ్మకంతో, స్నేహభావంతో రూపొందించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఆ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోందని, అందుకే తాము ఈ వైఖరి తీసుకున్నట్లు భారత్ తెలియజేసిందని అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి తన మద్దతును నిలిపివేసే వరకూ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించడం సాధ్యపడదని భారత్ స్పష్టం చేసింది. పెహల్గామ్ దాడి తర్వాత భారత భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) ఈ నిర్ణయం తీసుకుంది.
More Stories
పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్ కన్ను!
పాక్ కు చైనా ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ల సరఫరా
ఇరాన్పై బలప్రయోగం వద్దని చైనా, రష్యా హెచ్చరికలు