ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును ఎండగట్టాం

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును ఎండగట్టాం
 
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును తమ పర్యటనలో ఎండగట్టామని  తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఎంపీల బృందాల పర్యటనలో భాగంగా తాము నాలుగు దేశాలు వెళ్లామని , ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలిపారు. 
 
వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని పేర్కొంటూ వివిధ దేశాల్లోని మాజీ ప్రధానమంత్రులు, డిప్యూటీ స్పీకర్లను కలిసి వివరించామని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి వివరించామని, సామాన్యులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉగ్రవాదుల స్థావరాలను ఎలా టార్గెట్ చేశామనేది వివరించామని చెప్పుకొచ్చారు.
ఏ దేశానికి వెళ్లినా పాకిస్థాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న అంశాన్ని చెప్పుకొచ్చామని,  భారతదేశం ఎప్పుడూ శాంతిని మాత్రమే కోరుకుందని వివరించామని కృష్ణదేవరాయలు తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేశామని చెబుతూ పాకిస్థాన్ న్యూక్లియర్ పేరుతో బ్లాక్‌మెయిల్ చేసేలా ప్రయత్నం చేస్తే దానికి భయపడేదిలేదని తాము స్పష్టం చేశామని పేర్కొన్నారు. 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయా దేశాలు ముందుకెళ్లాలని కోరినట్టు చెప్పారు. పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక సహాయం అందకుండా చూడాలని కోరాంమని, వారిచ్చే నిధుల ద్వారా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఏవిధంగా పెంచి పోషిస్తుందో వివరించామని వివరించారు. 

ప్రధానమంత్రి నరంద్రమోదీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్రమంత్రి కిరణ్ రిజుజుల సూచనమేరకు 7 పార్లమెంట్ బృందాలతో కూడిన ఎంపీలందరం 35 దేశాల్లో ప్రయత్నించినట్లు చెప్పారు.శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో భేటీ అయి, తన విదేశీ పర్యటన అంశాలను వివరిస్తామని  ఆయన చెప్పారు. విదేశాలకు వెళ్లే బృందాల్లో తప్పకుండా టీడీపీ తరపున వెళ్లాలని సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.