
* ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 51 శాతం ఓట్లతో 136-159 స్థానాలు.. పీపుల్స్ పల్స్ ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వే
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వేలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడైంది. తొలి 24 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదరణ తగ్గుతున్న దశలో రానున్న 36 నెలలు కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత కీలకం కానున్నది.
సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా మొదటి దశలో ఉన్న ఆదరణ రెండో దశలో తగ్గుతుంటుంది. మొదటి రెండు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణ కోల్పోతూ ఉంటే రానున్న 3 సంవత్సరాల కాలంలో తమ ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకుంటుందో అన్నది వేచి చూడాలి. కర్ణాటకలో ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిపోయిందని ఈ సర్వేలో వెల్లడైంది.
కర్ణాటకలో 1985 నుండి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తదుపరి ఎన్నికల్లో సొంతంగా సంపూర్ణ మెజార్టీ సాధించలేదు. ఇదే ట్రెండ్ ఈ సారి కూడా కొనసాగే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10,481 శాంపిల్స్ తో 17 ఏప్రిల్ నుండి 18 మే వరకు, నెల రోజులపాటు ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ ట్రాకర్ పోల్ నిర్వహించింది.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలుండగా, మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113. ఈ సర్వే ప్రకారం ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 51 శాతం ఓట్లతో 136-159 స్థానాలు, కాంగ్రెస్ 40.3 శాతం ఓట్లతో 62-82 స్థానాలు, జేడీ(ఎస్) 5 శాతం ఓట్లతో 3-6 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని వెల్లడైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 10.7 ఓట్ల శాతం స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది.
పహల్గాం ఘటన, అనంతరం ఆపరేషన్ సిందూర్ కూడా బీజేపీకి అనుకూలంగా మారాయి. పాకిస్తాన్ లో కాల్పుల విరమణ తర్వాత, అంటే మే 10వ తేదీ తర్వాత బీజేపీకి 1 -1.5 శాతం ఓటర్ల మద్దతు పెరిగినట్టు సర్వేలో స్పష్టమైంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42.88 శాతం ఓట్లతో 135 స్థానాలు, బీజేపీ 36 శాతం ఓట్లతో 66 స్థానాలు, జేడీ(ఎస్) 13.29 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలుపొందగా, ఈ రెండేళ్ల వ్యవధిలో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రశ్నించినప్పుడు 55 శాతం మంది బీజేపీ, 39.1 శాతం మంది కాంగ్రెస్ అని, 3.6 శాతం మంది జెడి(ఎస్) అని, 2.3 శాతం మంది ఇతరులు అని పీపుల్స్పల్స్ -కొడెమో సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్లలో బీజేపీకి 48.4 శాతం, కాంగ్రెస్ కు 44.6 శాతం మద్దతు లభిస్తుండడంతో కాంగ్రెస్ పై బీజేపీ మహిళా ఓటర్లలో 3.8 శాతం ఆధిపత్యం కనబరుస్తోంది.
సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆశించిన ఆదరణ పాలకపక్షానికి లభించడం లేదు. పురుష ఓటర్లలో బీజేపీ 51.9 శాతం, కాంగ్రెస్ 38.9 శాతం ఓట్లు సాధిస్తుండడంతో, బీజేపీ కాంగ్రెస్ పై 13 శాతం భారీ ఆధిక్యత చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. 18 – 25 సంవత్సరాల ఓటర్లలో బీజేపీ 24 శాతం ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీపై కొనసాగిస్తోంది.
ఇతర వయసు ఓటర్లలో బీజేపీకి 48 శాతం నుండి 51 శాతం ఓట్లు లభిస్తుండగా, కాంగ్రెస్ కు 42 శాతం నుండి 44 శాతం ఓట్లు లభించవచ్చని పీపుల్స్ పల్స్ సర్వే సంకేతాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. గ్రామీణ ప్రాంతంలో 13.5 శాతం, పట్టణాల్లో 6.6 శాతం కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆధిక్యతలో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో జేడీ(ఎస్) 5.7 శాతం ఓట్లు సాధించవచ్చని సర్వేలో వెల్లడైంది.
రైతుల్లో బీజేపీకి 53.9 శాతం, కాంగ్రెస్ కు 37.4 శాతం ఓట్లు లభించవచ్చు. 2023 ఎన్నికల్లో రైతు సంబంధిత అంశాలను కీలకంగా ప్రచారం చేసి, సానుకూల ఫలితాలు సాధించిన కాంగ్రెస్ కు ప్రస్తుతం రైతుల్లో కూడా ఆదరణ తగ్గడం గమనించాల్సిన విషయం. కర్ణాటకలో మత, కుల రాజకీయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ సామాజిక వర్గం లో బీజేపీకి 58.5 శాతం ఆదరణ లభిస్తుండగా, కాంగ్రెస్ కు లభిస్తున్న ఆదరణ కేవలం 32 శాతానికే పరిమితమైంది.
ముస్లిం సామాజికవర్గంలో 85.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ పటిష్టంగా ఉండగా, బీజేపీ కేవలం 9.3 శాతం ఓట్లే పొందే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని జనరల్ కేటగిరీ ఓటర్లలో 15.1 శాతం, ఓబీసీల్లో 14 శాతం, ఎస్టీల్లో 22 శాతం ఆధిక్యత బీజేపీ కనబరుస్తోంది. రాష్ట్రంలో కీలకమైన లింగాయత్ సామాజిక వర్గంలో బీజేపీకి 78.9 శాతం ఆదరణ లభిస్తుండగా, కాంగ్రెస్ కు కురుబా సామాజికవర్గంలో 54.6 శాతం ఆదరణ కనిపిస్తోంది.
మరోవైపు ఒక్కలింగాల సామాజికవర్గంలో బీజేపీకి 47.8 శాతం, జేడీ(ఎస్)కు 24.6 శాతం, కాంగ్రెస్ కు 22.9 శాతం ఆదరణ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ కురుబ, ఆదికర్ణాటక, మాదిగ, మాదర్ సామాజికవర్గాల్లో బీజేపీపై ఆధిక్యత కనబరుస్తుండగా, లింగాయత్(వీరశైవాస్), ఒక్కలింగాస్ నాయక్/ నాయక్ వాల్మీకి, మరాఠాస్, విశ్వకర్మ సామాజికవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
ఎస్సీలో కాంగ్రెస్ పార్టీ 51.5 శాతం ఓట్లు పొందుతుండగా, బీజేపీకి 41.7 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఎస్సీ సామాజికవర్గంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీకి 9.8 శాతం ఓట్ల ఆధిక్యత లభించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని ఈ సర్వేలో మరోసారి స్పష్టమైంది.
రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు 29.2 శాతం మద్దతు ఇస్తుండగా, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కు 10.7 శాతం, జేడీ(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామికి 7.6 శాతం, బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియురప్పకు 5.5 శాతం, కర్ణాటక బీజేపీ అధ్యక్షులు బీ.వై. విజయేంద్రకు 5.2 శాతం ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు