ఎవరెస్ట్ ఎక్కిన సీఐఎస్ఎఫ్ మ‌హిళా అధికారి గీతా స‌మోట‌

ఎవరెస్ట్ ఎక్కిన సీఐఎస్ఎఫ్ మ‌హిళా అధికారి గీతా స‌మోట‌

సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూర్టీ ఫోర్స్‌కు చెందిన మ‌హిళా అధికారిణి గీతా స‌మోట  అసాధార‌ణ రీతిలో ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించి ఎవ‌రెస్టు శిఖ‌రాన్ని ఎక్కిన తొలి సీఐఎస్ఎఫ్ మ‌హిళా అధికారిణిగా నిలిచారు. ఎవ‌రెస్టు శిఖ‌రం 8,849 మీట‌ర్ల ఎత్తు ఉన్న విష‌యం తెలిసిందే. ఆమె సాధించిన ఘ‌న‌ట ప‌ట్ల సీఐఎస్ఎఫ్ సీనియ‌ర్ అధికారులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

ఇది వ్య‌క్తిగ‌త విజ‌యం మాత్ర‌మే కాదని, ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూర్టీ ద‌ళంలో మ‌హిళా శ‌క్తిని చాటింద‌ని పేర్కొన్నారు. ప‌ర్వ‌తాలు స‌మాన‌త్వానికి చిహ్నల‌ని, అవి మ‌న జెండ‌ర్ గురించి ప‌ట్టించుకోవ‌ల‌ని, కేవ‌లం ఎక్స్ ఫ్యాక్ట‌ర్ ఉన్న వాళ్లు మాత్ర‌మే ఆ శిఖ‌రాల‌ను అధిరోహించ‌గ‌ల‌ర‌ని గీత పేర్కొన్న‌ది. రాజస్థాన్‌లోని సిక‌ర్ జిల్లాకు చెందిన గీత‌ ప‌ల్లెటూరు నుంచి వ‌చ్చింది. 

చాక్ గ్రామంలో ఓ పేదింట్లో ఆమె పుట్టింది. ఆమె న‌లుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. కాలేజీ రోజుల్లో ఆమె హాకీ ఆడేది. అయితే గాయం వ‌ల్ల ఆమె కెరీర్‌కు బ్రేక్ వ‌చ్చింది. కానీ కొత్త‌గా ప‌ర్వ‌తారోహ‌ణ‌కు శ్రీకారం చుట్టింది. 2011లో ఆమె సీఐఎస్ఎఫ్‌లో చేరింది.  2015లో ఔలీలో ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీసు ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్‌లో ఆమె ప‌ర్వ‌తారోహ‌ణ శిక్ష‌ణ తీసుకున్న‌ది. 2017లో మౌంటెనీరింగ్ అడ్వాన్స్ ట్రైనింగ్ పూర్తి చేసింది. 2019లో ఉత్త‌రాఖండ్‌లోని స‌తోపంత్‌(7075 మీ), నేపాల్‌లోని లోబోచి(6119 మీ) ప‌ర్వ‌తాల‌ను ఎక్కారు. 2021లో ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని ఎక్కాల‌ని ప్లాన్ చేసిందామె. 

కానీ ఆ ప్లాన్ విక‌టించ‌డంతో ఏడు ఖండాల‌కు చెందిన ఏడు శిఖ‌రాల‌ను ఎక్కే ప్లాన్ చేసింది. ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసిజుకో, ర‌ష్యాలోని మౌంట్ ఎల్‌బ్ర‌స్‌, టాంజానియాలోని కిలిమంజారో, అర్జెంటీనాలోని అకోన్కాగువా ప‌ర్వ‌తాల‌ను కేవ‌లం ఆరు నెల‌ల తేడాలో ఎక్కారు. ఆ ఘ‌న‌త సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా గుర్తింపు తెచ్చుకున్న‌ది. ల‌డాఖ్‌లోని రుప్సు ప్రాంతంలో 5వేల మీట‌ర్ల ఎత్తున్న‌ అయిదు ప‌ర్వ‌తాల‌ను ఎక్కారు.