
పహల్గాం ఉగ్ర దాడికి ముందు ఆమె పాకిస్థాన్లోనే ఉందని హరియాణాలోని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. తరచూ ఆమె పాక్ పర్యటనలకు వెళ్లారని, ఒకసారి చైనా పర్యటనకూ వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ జ్యోతి మల్హోత్రా పాక్ ఏజెంట్లతో టచ్లో ఉన్నారని హిస్సార్ ఎస్పీ చెప్పారు.
పోలీసులు ఆమె ఫోన్, లాప్టాప్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. కాగా, గతేడాది మే నెలలోనే కపిల్ జైన్ అనే ‘ఎక్స్’ వినియోగదారు జ్యోతిపై దృష్టి సారించాలని ఎన్ఐఏను కోరుతూ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం విశేషం. ఆమె తొలుత పాక్ ఎంబసీలో ఫంక్షన్కు హాజరైందని, తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిందని, అనంతరం కశ్మీర్ పర్యటనకూ వెళ్లనుందని… దీని వెనుక ఏదో ఉందని అందులో పేర్కొన్నారు.
జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వారితో పంచుకుందని ప్రస్తుత దశలో చెప్పలేమని ఎస్పీ తెలిపారు. కానీ, పాక్ నిఘా వర్గాలతో ఆమె నేరుగా సంప్రదింపులు జరిపారని చెప్పారు. వాళ్లు ఆమెను ఓ అస్త్రంగా చేసుకున్నారని కచ్చితంగా చెప్పగలమని స్పష్టం చేశారు. జ్యోతి ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా టచ్లో ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
వాళ్లు కూడా పీఐవోలతో సంప్రదింపులు జరుపుతున్నారని, అయితే ఇది కూడా ఓ రకమైన యుద్ధమేనని తెలిపారు. ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుంటూ వారి ప్రయత్నాలను అమలు చేస్తారని పేర్కొన్నారు. ఇటీవల బహిష్కరణకు గురైన పాకిస్థాన్ అధికారితో కూడా ఆమె టచ్లో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎక్కడికి వెళ్లింది? ఎవరిని కలిసింది? అనే విషయాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో ఆమె ల్యాప్టాప్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తామని వెల్లడించారు. ఏం సమాచారం పంచుకుందనే విషయం అప్పుడు స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
మే 7వ తేదీ నుంచి ఇప్పటివరకు పంజాబ్, హరియాణాల్లో మొత్తం ఏడుగురిని గూఢచర్యం కేసులో అరెస్టు చేశారు. ఈ గూఢచర్యం వ్యవహారం ఒడిశా రాష్ట్రానికీ చేరింది. ఒడిశాలో పూరీకి చెందిన ఓ మహిళా యూట్యూబర్కు జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఉంది. జ్యోతి 2024 సెప్టెంబరులో పూరీని సందర్శించారు. పూరీకి చెందిన యూట్యూబర్ ఇటీవలే పాక్లోని కర్తార్పూర్ గురుద్వారాను సందర్శించారు.
More Stories
ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి
నకిలీ ఆధార్ కార్డుల తయారీలో బెంగాల్ లో నలుగురు అరెస్ట్
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు