ఆసియా కప్ నుంచి భారత్ నిష్క్రమణ!

ఆసియా కప్ నుంచి భారత్ నిష్క్రమణ!
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బోర్డ్​ ఆఫ్​​ కంట్రోల్​ ఫర్​ క్రికెట్​ ఇన్​ ఇండియా (బీసీసీఐ) ఈ ఏడాది జరిగే ఆసియా కప్‌ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి భారత బోర్డు సమాచారం ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. 

తద్వారా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే పురుషుల ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన భారత జట్టు ఆడే అవకాశాలు లేనట్లు సమాచారం. ఇక, జూన్‌లో జరిగే మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై బోర్డు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

పాకిస్థాన్‌ క్రికెట్‌ను ఏకాకిని చేయాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌ ఈవెంట్లకు ఉన్న స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే.  కాగా, భారత్‌-పాకిస్థాన్​ మధ్య మ్యాచ్​ లేకుండా ఆసియా కప్‌ ఉంటే, దాన్ని ప్రసారం చేసేందుకు బ్రాడ్‌కాస్టర్లు కూడా అంత ఆసక్తి చూపించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టీమ్​ఇండియా లేకుండా ఆసియా కప్‌ టోర్నీని నిర్వహించడం అనేది సరైన నిర్ణయం కాదని ఏసీసీ భావించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల అభిప్రాయం.

మరోవైపు, ఆసియా క్రికెట్‌ మండలికి ప్రస్తుతం పాకిస్థాన్‌ మంత్రి, పీసీబీ ఛైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నాడు. “పాక్‌ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్‌ మండలి నిర్వహించే టోర్నీల్లో భారత జట్టు ఆడదు. అది మా దేశ సెంటిమెంట్‌. అందుకే మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీసీకి మౌఖికంగా సమాచారం అందజేశాం” అని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు ఆ కధనాలు స్పష్టం చేస్తున్నాయి. 

భవిష్యత్తులో జరగబోయే ఏసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారని తెలుస్తున్నది. మరోవైపు, 2024లో ఆసియా కప్‌ బ్రాడ్​కాస్టింగ్ రైట్స్​ను సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా దక్కించుకుంది. వచ్చే ఎనిమిది సంవత్సరాల పాటు ప్రసారాలు చేసేలా 170 మిలియన్‌ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ ఇప్పుడు టోర్నీ జరగకపోతే ఆ డీల్‌ రద్దయ్యే అవకాశం ఉంది.

ఇంతకుముందు, 2023 ఆసియా కప్‌ ఎడిషన్‌పైనా భారత్‌- పాకిస్థాన్‌ సంబంధాలు ప్రభావం చూపిచాయి. ఆ ఎడిషన్​లో టోర్నీకి పాకిస్తాన్​ ఆతిథ్యమిచ్చింది. ఆ దేశానికి వెళ్లేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. దీంతో శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు.  మామూలుగానే ఇండియా-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగట్లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఆడుతున్నాయి. ఇప్పుడు ఆసియా కప్‌ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో టోర్నీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.