ప్రపంచ బ్యాంకు సహాయక పాత్ర మాత్రమే

ప్రపంచ బ్యాంకు సహాయక పాత్ర మాత్రమే
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తూ భారత్ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా తొలిసారి స్పందిస్తూ ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంక్ జోక్యం చేసుకుంటుందంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టివేశారు. ప్రపంచ బ్యాంక్ పాత్ర కేవలం ఒక సహాయకుడిగానే ఉంటుందని తెలిపారు.
భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతను పరిష్కరిస్తారన్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. ప్రపంచ బ్యాంక్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందని మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయని, ఇవి అస్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ఈ వివాదంలో ప్రపంచబ్యాంక్‌ పాత్ర కేవలం సహాయకుడిగా మాత్రమే పరిమితమై ఉంటుందని స్పష్టం చేశారు.  
 
అజయ్ బంగ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ సమావేశం జరగడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది.  దీంతో సింధు జలాల ఒప్పందం రద్దు అంశంపై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తితం చేసే అవకాశాలపై ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, 2027 లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న యుపిలో పెట్టుబడి అవకాశాల కోసం బంగా భారత్‌లో ఉన్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌తో  చర్చలు కూడా షెడ్యూల్‌లో ఉన్నట్లు ప్రకటన  పేర్కొంది.

పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన మరుసటి రోజే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. దీనిపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ”నీళ్లివ్వకుంటే రక్తపాతం జరుగుతుంది” అంటూ తీవ్ర ప్రకటనలకు పాక్ నేతలు దిగారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో 1960 సెప్టెంబర్‌లో సింధు నది, దాని ఉపనదుల జలాల పంపకంపై భారత్-పాక్ మధ్య ఒప్పందం జరిగింది. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ ప్రధాని అయూబ్‌ఖాన్ దానిపై సంతకాలు చేశారు. 

కాగా, సింధు జలాల పంపిణీ ఒప్పందం నిబంధనలపై పునః సమీక్ష జరపాలని భారత్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. తాగు, సాగునీటి అవసరాల్లో అప్పటికీ ఇప్పటికీ తేడాలొచ్చాయని భారత్ స్పష్ట చేసింది.అయితే పాక్ దీనిని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందం అమలును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.