ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు.. రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ

ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు.. రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ
సరిహద్దుల్లో పాక్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్‌ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని నిర్ణయించింది.  ఇందులోని అధికారులు, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు అధికారం కల్పించింది.
టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948 కింద కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెగ్యులర్‌ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంది.  సైనిక రిజర్వ్ ఫోర్స్‌గా టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంటుంది. ప్రత్యర్థులతో తలపడేందుకు భారత్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు ఈ టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది.  రెగ్యులర్ ఆర్మీలో ఇది భాగమే అయినప్పటికీ అవసరమైన సందర్భంలోనే ఈ టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. 
1962, 1965, 1971 యుద్ధాల్లోనూ భారత సైన్యంతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేసింది. రెగ్యులర్ ఆర్మీకి సెకండరీ ఫోర్స్‌గా ఉండే టెరిటోరియల్ ఆర్మీలోని సిబ్బందికి నేషనల్ ఎమర్జెన్జీ, అంతర్గత భద్రత విధులకు సంబంధించి శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం 32 టెరిటోరియల్ ఆర్మీ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ ఉన్నాయి.  టెరిటోరియల్ ఆర్మీ గురించి ఒక్క చెప్పాలంటే సైనిక రిజర్వ్ ఫోర్స్ అని చెప్పవచ్చు. 
ఇందులోని వారికి అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ ఉంటుంది. వారంతా బయట తమ పనులు చేసుకుంటూనే వాలంటరీగా సైన్యంతో పనిచేస్తుంటారు. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు అలా ఉన్నట్లు సమాచారం. టెరిటోరియల్ ఆర్మీ అధికారుల్లో పలువురు ఇప్పటికే శౌర్య, విశిష్ఠ పురస్కారాలను కూడా అందుకున్నారు.  ఇటీవల కేరళలో వరదలు వచ్చిన సేవలు అందించిన మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయి అధికారే.
ఆ జాబితాలో మోహన్​ లాల్​తోపాటు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కాంగ్రెస్ నేత సచిన్‌ పైలట్, భారత మాజీ దిగ్గజం కపిల్ దేవ్, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్, అథ్లెట్ అభినవ్ బింద్రా సహా పలువురు సెలబ్రిటీలు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో ఉన్నారు. కాగా, పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం సౌత్‌ బ్లాక్‌లో సైన్యం, నేవీ, వాయుసేన అధిపతులతో సమావేశయయ్యారు.
సమావేశానికి త్రివిధ దళాల అధిపతులతో పాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గత రాత్రి పాకిస్తాన్‌ జరిపిన దాడులు, భారత దళాలు స్పందించిన తీరుపై రాజ్‌నాథ్‌కు వివరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి, ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై వారితో రాజ్‌నాథ్‌ చర్చించారు. గతరాత్రి పాకిస్తాన్‌ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే.