త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

పాకిస్థాన్‌తో సైనిక ఘర్షణలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, భద్రతా సలహాాదారు అజిత్ ఢోబాల్ పాల్గొన్నారు. సరిహద్దలోని తాజా పరిస్థితిని మోదీ సమీక్షించారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది.  కొందరు మాజీ సైనికాధికారులు కూడా ప్రధానిని కలిశారు.ఆ తర్వాత ప్రధాని మోదీ సరిహద్దు రాష్ట్రాలు రాజస్థాన్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు.

సరిహద్దులో పరిస్థితులను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సిడిఎస్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ కూడా పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. బిఎస్‌ఎఫ్‌, సిఐఎస్‌ఎఫ్‌, హోంశాఖలోని సీనియర్‌ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సైన్యం మెరుపుదాడులు నిర్వహించిన మరుసటిరోజు దాయాది దేశం ఉనికిని చాటుకునేందుకు కుట్రలకు తెరలేపిన విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలు చేపట్టాయి. వేడుకల్లో బాణసంచా, డ్రోన్ల వాడకంపై గుజరాత్‌ సర్కార్‌ నిషేధం విధించింది.

పంజాబ్‌లో ఔట్‌డోర్‌లో ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఇతర పవర్‌ బ్యాకప్‌ వస్తువుల వాడకంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్తో ప్రధాని మోదీ మాట్లాడారు. సరిహద్దులో ఉన్న జిల్లాల్లో తీసుకున్న భద్రతాచర్యలపై ఆరా తీశారు. భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్‌, బనస్కంతా, పటాన్‌, జామ్‌నగర్‌లో పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగారు. సమస్యాత్మక జిల్లాల్లో చేపట్టిన చర్యలపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు.

ఉరి సెక్టార్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పర్యటించి భద్రతను సమీక్షించారు. జమ్మూలో కాల్పులు, పేలుళ్ళ శబ్దాలు వినిపిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. ప్రజలు ధైర్యంగా, సహనంగా ఉండాలని ఆయన కోరారు. జమ్మూతో పాటు, సాంబా, పఠాన్‌కోట్‌లలో పాక్‌ డ్రోన్‌దాడులు కొనసాగాయి. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో భద్రతపెంపుపై త్రిపుర సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక, ఆరోగ్య శాఖలు వరుస సమావేశాలు నిర్వహించాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్‌, జేపీ నడ్డా భేటీ అయ్యారు. సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆర్థికపరంగా సన్నద్ధత, ఆరోగ్య సేవల అందుబాటు తదితర అంశాలపై చర్చించారు.