ఐదుగురిని హతమార్చి ఏపీ జవాన్ వీరమరణం 

ఐదుగురిని హతమార్చి ఏపీ జవాన్ వీరమరణం 

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ (24) వీరమరణం చెందారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు మురళి నాయక్ ఒక్కరే సంతానం. జవాన్ మురళీ నాయక్ మృతితో, కల్లితండాలో అతని ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ 2022 అక్టోబర్​లో మొదటిసారి అగ్నివీర్​కు ఎంపిక అయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్​లో విధులు నిర్వహించేవాడు.

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ భారత సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి, డ్రోన్‌ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా తెలుగు జవాన్‌ వీర మరణం పొందారు. గురువారం రాత్రి చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ ఐదుగురు చొరబాటుదారులను హతమార్చారు.
అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్​కు నివాళులర్పించారని అంటూ ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మురళీనాయక్ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి సీఎం చంద్రబాబు వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వీరజవాన్ మురళీ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిది అయినా, ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు.

మురళీ నాయక్ మరణించడంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి సవిత సొంత నిధులతో జవాన్ తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జవాను తల్లిదండ్రులను ఫోన్లో ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నానికి జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం గ్రామానికి చేరుతుందని,  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. యువతలో స్ఫూర్తిని నింపే విధంగా జవాన్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.