పునర్విభజన చట్టంలో అమరావతి పేరు

పునర్విభజన చట్టంలో అమరావతి పేరు

2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రి మండలి కోరింది. దీని వలన అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని కేబినెట్ పేర్కొంది.  ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనను ఆమోదం తెలిపింది. ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఓకే చెప్పింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వంకు పంపాలని నిర్ణయించారు. క్యాపిటల్ అమరావతిని ఫ్రీ జోన్‌గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.  2014 పునర్విభజన చట్టంలో రాజధాని అమరాతి అని లేదని, ఒకసారి పునర్విభజన చట్టంలో రాజధాని అమరావతి అని నిర్ణయిస్తే రాజధానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందని పలువురు న్యాయనిపుణులతో పాటు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన రైతులు కూడా సూచించారు.

ఈ క్రమంలో రాజధాని అమరావతిగా నిర్ణయించి కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. 2014 పునర్విభజన చట్టాన్ని కేంద్రంలో ఉన్న ఉభయసభలు ఆమోదించాయి. అందువల్ల వాటికి చట్టసవరణ చేయాలి అంటే రాజ్యసభ, లోకసభ చేయాల్సి ఉండటంతో ఏపీ రాజధాని అమరావతి అని పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని తీర్మానంలో కేంద్రాన్ని అభ్యర్థించారు.  దీనికి సంబంధించి వెంటనే ఢిల్లీలోని ఎంపీలతో మాట్లాడి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ఆమోదించేలా చూడాలని నిర్ణయించారు. 

దీనితో పాటు ఏపీలో వివిధ సంస్థలకు భూములు కేటాయింపు, రాజధాని అమరావతిలో ఇటీవల కాలంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో భూముల కేటాయింపుపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ ప్రాజెక్ట్ వలన ఎంతో ఉపయోగం ఉందని మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ఏపీ కేబినెట్‌ అభినందనలు తెలియజేసింది. సిందూర్‌ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్‌ చేశారని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. . తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించింది.