పర్యాటకులు తప్పించుకునేందుకు వీల్లేకుండా ఉగ్రదాడి

పర్యాటకులు తప్పించుకునేందుకు వీల్లేకుండా ఉగ్రదాడి

పెహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. లోకల్‌ ఫొటోగ్రాఫర్లు, దుకాణదారులు, డ్రైవర్లను ఇలా దాదాపు 45 మంది ప్రత్యక్ష సాక్షులను పిలిచి విచారించింది. ఈ సందర్భంగా వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బైసరాన్‌ లోయలో పర్యాటకులు తప్పించుకునేందుకు వీల్లేకుండా ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాలను ఉగ్రవాదులు బ్లాక్‌ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తమ వాంగ్మూలంలో తెలిపారు.

ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేటు నుంచి లోపలికి ప్రవేశించినట్లు చెప్పారు. మరో ఉగ్రవాది ఎగ్జిట్‌ గేటు వద్ద ఎవరినీ బయటకు వెళ్లనీకుండా కాపలా కాసినట్లు తెలిపారు. తొలిసారి కాల్పులు మొదలైంది ఎగ్జిట్‌ గేటు వద్దే అని వివరించారు. దీంతో సందర్శకులు భయంతో ఎంట్రీ గేటువైపు పరుగులు తీయగా అక్కడ ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.

ముందుగా ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లిన టూరిస్ట్‌లను మహిళలు, పురుషులు రెండుగా విడిపోవాలని ఉగ్రవాదులు ఆదేశించారు. అయితే, అందుకు వారు నిరాకరించడంతో హిందూ, ముస్లింలు వేరు కావాలని చెప్పారు. అందుకు కూడా సందర్శకులు నిరాకరించారు. దీంతో వారు వరుసగా దాడులకు పాల్పడ్డారు. ఇక కాల్పులు జరిపే ముందు పర్యాటకులను కల్మా పఠించాలని కోరారు. 

కల్మా పఠించిన వారిని ఉగ్రవాదులు వదిలిపెట్టారు. ఇక ప్రవేశ ద్వారం నుంచి వచ్చిన నేవీ అధికారి లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌ ఉగ్రవాదుల కాల్పులకు గురైన మొదటి వ్యక్తి. టూరిస్ట్‌ స్పాట్‌లోని టీ స్టాల్‌, ఫుడ్‌ స్టాల్‌ ప్రాంత సమీపంలోనే అత్యధికంగా ప్రాణ నష్టం జరిగింది. దాడి అనంతరం ముగ్గురు ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తమ వాంగ్మూలంలో తెలిపారు. 

ఇక మరో ఉగ్రవాది దాడిలో పాల్గొన్న వారికి రక్షణ కల్పించేందుకు సమీపంలోని అడవిలో దాక్కొని ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు ముష్కరులు సైనిక దుస్తులు ధరించగా, ఒకరు సంప్రదాయ కశ్మీరీ డ్రెస్‌లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తమ వాంగ్మూలంలో వెల్లడించారు.

కాగా, భారత్‌లో పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఎక్స్‌ ఖాతాను నిలిపివేసింది. జమ్ము కశ్మీర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో పాక్‌ రక్షణ మంత్రి వాజా అసీఫ్‌ ఎక్స్‌ ఖాతాను భారత్‌లో బ్లాక్‌ చేసింది.  అంతకుముందు పాకిస్థాన్‌ ప్రభుత్వ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌ను యాక్సెస్‌ చేయకుండా నిలిపివేసింది. పలువురు పాకిస్థాన్‌ జర్నలిస్టులకు చెందిన ఎక్స్‌ ఖాతాలను కూడా నిషేధించినట్లు తెలిసింది. అంతేకాదు, తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్థాన్‌ యూట్యూబ్‌ చానళ్లపై సోమవారం నిషేధం విధించింది.