జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ

జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ
పహల్గామ్‌ దాడితో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాతున్న వేళ జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం పునరుద్ధరించింది. బోర్డు ఛైర్మన్‌గా రా మాజీ చీఫ్‌ అలోక్‌ జోషిని నియమించింది. జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది.  ఈ బోర్డు దేశ భద్రతా వ్యవహారాలపై సలహాలు, సిఫార్సులు అందించే ఉన్నత స్థాయి సంస్థగా పనిచేయనుంది. 
ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. వీరంతా తమ రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు. సైనిక సేవల నుంచి రిటైరైన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఈ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు.  వీరి సైనిక నైపుణ్యం, వ్యూహాత్మక దృష్టి బోర్డు నిర్ణయాలకు బలాన్ని చేకూర్చనుంది.
అలాగే, ఇండియన్ పోలీస్ సర్వీస్  నుంచి రిటైరైన రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్ కూడా బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. వీరు దేశీయ భద్రత, శాంతి భద్రతల విషయాల్లో తమ అనుభవాన్ని అందించనున్నారు.  ఇండియన్ ఫారిన్ సర్వీస్  నుంచి రిటైరైన బీ వెంకటేష్ వర్మ కూడా ఈ బోర్డులో సభ్యుడిగా ఉంటారు. ఆయన అంతర్జాతీయ వ్యవహారాలపై నైపుణ్యం బోర్డుకు అదనపు సేవలను అందించనున్నారు. ఈ బోర్డు ఏర్పాటు దేశ భద్రతా వ్యవస్థలో ఒక కీలక నిర్ణయంగా చెప్పవచ్చు. 
 
ఎందుకంటే దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్జాతీయ రాజకీయాలు, సైబర్ భద్రత, ఉగ్రవాద బెదిరింపులు వంటి అంశాలపై ఈ బోర్డు సమగ్ర విశ్లేషణలు, సలహాలు అందించనుంది. అలోక్ జోషి వంటి అనుభవజ్ఞులైన నేత ఛైర్మన్‌గా ఉండటం వల్ల ఈ బోర్డు నిర్ణయాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బహుముఖ సభ్యుల నైపుణ్యం ఉన్న ఈ బోర్డు విభిన్న దృక్కోణాలతో సమస్యలను పరిశీలించే సామర్థ్యాన్ని కల్గి ఉంటుంది. సైనిక, పోలీస్, విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఈ సభ్యులు కలిసి దేశ భద్రతా విధానాలను రూపొందించడంలో, అమలు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు.