దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం

దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం
దేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జన గణనలో కుల గణన అంశాన్ని చేర్చాలని కేంద్ర కేబినేట్‌ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.   పారదర్శకంగా కులగణన జరగాలని కేంద్రం భావిస్తోంది.
ఇందు కోసం సర్వేలపై ఆధారపడకుండా జనాభాలెక్కలలోనే ఈ విషయం నిర్ధారణ చేసుకుంటే సామాజిక సమతుల్యతకు ఆస్కారం లభిస్తుందని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కులగణన చేపట్టాయని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వాటిలో కొన్ని రాష్ట్రాలు రాజకీయ సాధనంగా కులగణనను వాడుకున్నాయని ఆయన ఆరోపించారు.  
 
వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లు తీసుకొచ్చే సర్వేలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని, దీని వల్ల సమాజ శ్రేయస్సు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. “రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని నిర్ణయించింది” అని చెప్పారు. కుల గణనను రాజకీయం చేసినందుకు ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. 
 
కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలో నిర్వహించిన సర్వేలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమన్న ఆయన.. “కాంగ్రెస్ దాని ఇండియా కూటమి భాగస్వాములు కుల గణనను రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాయని అందరికీ తెలుసు. కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించడానికి సర్వేలు నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు దీన్ని బాగా చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు పారదర్శకంగా లేని విధంగా రాజకీయ కోణం నుండి మాత్రమే ఇటువంటి సర్వేలను నిర్వహించాయి” అని తెలిపారు.
 
“ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను సృష్టించాయి. మన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెదిరిపోకుండా చూసుకోవడానికి, సర్వేలకు బదులుగా కుల గణనను జనాభా గణనలో చేర్చాలి” అని మంత్రి పేర్కొన్నారు. కులాల జనాభా లెక్కించి ఆ సంఖ్య ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలని విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కొంత కాలంగా కోరుతున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. 
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుండి చేపట్టిన జనగణనలో కులగణన భాగం కాలేదని, 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (లేటు) లోక్‌సభలో కులగణనను కేబినెట్‌ అంశంగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా రాజకీయ పార్టీలు కులగణనను సిఫారసు చేశాయి. కానీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణనకు బదులుగా కులసర్వేను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిందని, ఈ సర్వేను ఎస్‌ఇసిసి అంటారని చెప్పుకొచ్చారు.
 
కుల గణనకు సంబంధించిన అంశంతోపాటు కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు చేసింది. సిల్చార్‌- షిల్లాంగ్‌ హైస్పీడ్‌ కారిడార్‌కు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అసోం- మేఘాలయా మధ్య కొత్త హైవేకు అనుమతిచ్చింది కేంద్ర క్యాబినెట్. చెరకు రైతులకు కనీస మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం. రూ. 22,846 కోట్లతో షిల్లాంగ్‌ నుంచి సిల్చార్‌ వరకు హైస్పీడ్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.  క్వింటాల్ చెరకుకు అదనంగా 15 రూపాయలను చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్వింటా చెరకుకు 355 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించిందని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు