
సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో బుధవారం ఉదయం 2.30 గంటల ప్రాంతంలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి, వానకు గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సింహాచలం చందనోత్సవం వేళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా గోడకూలి క్యూ లైన్ లో వెడుతున్న భక్తులపై పడింది. క్షతగాత్రుల తరలింపుకు 17 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సింహాచలం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి పరిహారం ప్రకటించారు. మఅతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు.
సింహాచలంలో గోడకూలిన ఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలిందని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ శాఖ సిబ్బంది నేతృత్వంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని హోం మంత్రి తెలిపారు.
More Stories
సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 42 లక్షలు నగదు
రోహింగ్యాల వలసలతో అంతర్గత భద్రతకు ప్రమాదం
నాలుగన్నర గంటల్లోనే విజయవాడ నుండి తిరుపతి