పాక్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి

పాక్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి
మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం పట్ల ఆగరహం వ్యక్తం చేస్తూ అలా మాట్లాడాలనుకుంటే పాకిస్థాన్‌కే వెళ్లిపోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హితవు చెప్పారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదంటూ ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో హాలులో జనసేన పార్టీ తరపున నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని స్పష్టం చేశారు.  కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.
 
ఉగ్రఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలని చెబుతూ చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారని కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌కు వెళ్తే చంపేశారని పవన్ ప్రశ్నించారు. కశ్మీర్‌ మనది కాబట్టే అక్కడికి వెడితే ఉగ్రవాదులు గుర్తింపుకార్డు అడిగి కాల్చి చంపారు మధు భార్య చెప్పారని పవన్ తెలిపారు.
 
హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటేనని పేర్కొంటూ ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని, మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపిచ్చారు. కశ్మీర్‌లో జరిగితే ఆ ప్రకంపనలు మనకు తగిలాయని చెబుతూ సరిహద్దు నియంత్రణ వద్ద విధులు చాలా కష్టమని పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉగ్రవాదుల ఏరివేతలో ప్రతి ఒక్కరూ ఎన్డీయేకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. “దేశంలో సహనం ఎక్కువైంది అతి సహనం మంచిది కాదు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉండాలి. ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి. ముస్లింలపై వివక్ష చూపిస్తే ఇంతమంది ఇక్కడ ఎలా ఉంటారు. శరణార్థులు దేశానికి అదనపు భారం” అని తెలిపారు.