ఏపీ బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ

ఏపీ బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ

ఏపీలో ఖాళీ అయిన ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. మంగళవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా వెంకటసత్యనారాయణ ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. 

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఆశించినా, ఆఖరు నిమిషంలో సోము వీర్రాజు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థిత్వం విషయంలో ఎవరూ ఊహించని విధంగా పాకా వెంకటసత్యనారాయణ అభ్యర్ధిగా బరిలో దిగనున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన పాకా వెంకటసత్యనారాయణ స్వస్థలం భీమవరం. న్యాయవాద వృత్తిలో కొంతకాలం కొనసాగారు. గతంలో మునిసిపల్ కౌన్సిలర్ గ పనిచేశారు.

1976 లో ఆర్‌ఎస్‌ఎస్​లో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. 1978లో భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాల ఏబీవీపీ కాంపస్‌ ఇన్​ఛార్జ్​గా సేవలందించి 1980లో బీజేపిలో చేరారు. అప్పటినుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తూ వస్తున్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా,  భీమవరం అసెంబ్లీ కన్వీనరుగా, నరసాపురం పార్లమెంట్‌ కన్వీనరుగా పలు పదవులు నిర్వహించారు.

బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యునిగా, బీజేపీ ఉపాధ్యక్షునిగా, పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేసిన పాకా వెంకట సత్యనారాయణ ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.