ఎంసీఆర్​హెచ్​ఆర్డీ వైస్ ఛైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారి

ఎంసీఆర్​హెచ్​ఆర్డీ వైస్  ఛైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారి
బుధవారం పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పదవీ విరమణ అనంతరం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్​హెచ్​ఆర్డీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వీసీ హోదాలో ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. కొత్త సీఎస్‌గా ఇప్పటికే రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. 
 
శాంతికుమారికి పీసీబీ ఛైర్‌పర్సన్ లేదా సమాచార ప్రధాన కమిషనర్‌గా నియమిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ప్రభుత్వం ఎంసీహెచ్‌ఆర్‌డీ బాధ్యతలను అప్పగించింది. మరోవంక, ముఖ్యమంత్రి కార్యాలయంలోని చీఫ్‌ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి, కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిలను బదిలీ చేసి సమాచార కమిషనర్లుగా నియమించినట్లు తెలిసింది. 
 
ప్రధాన కమిషనర్‌గా ఐఎఫ్‌ఎస్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లుగా  పీవీ శ్రీనివాసరావు,  బోరెడ్డి అయోధ్యరెడ్డి, కప్పర హరిప్రసాద్‌, పీఎల్‌ఎన్‌ హరిప్రసాద్‌, రాములు, వైష్ణవి, పర్వీన్‌ మొహిసిన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. సంబంధించిన ఫైల్‌ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు పంపించినట్టు తెలుస్తున్నది.  గవర్నర్‌ ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఏడుగురు కమిషనర్లలో ముగ్గురు జర్నలిస్టులు ఉండడం గమనార్హం. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్టీఐ అమలుకు సంబంధించిన కమిషనర్ల నియామకం జరగలేదు.

కాగా, తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​కు ఇద్దరు సభ్యులను నియమిస్తూ ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టెక్నికల్ సభ్యుడిగా కంచర్ల రఘును, ఫైనాన్స్ సభ్యుడిగా చెరుకూరి శ్రీనివాసరావును నియమించినట్లు ఆయన తెలిపారు.  తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ ఛైర్మన్​గా దేవరాజు నాగర్జున్ ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఛైర్మన్ నియామకం అనంతరం ప్రభుత్వం మెంబర్స్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు వారి నియామక ప్రక్రియను కూడా వేగంగా పూర్తిచేసింది. దీంతో పూర్తిస్థాయిలో కమిషన్ అందుబాటులోకి వచ్చింది.