పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఈ మారణహోమంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పర్యాటకులను చంపేందుకు టెర్రిరిస్టులు పెద్ద ప్రణాళికే రచించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు పహల్గాంకు చేరుకునేందుకు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
తమ ప్రణాళికను అమలుచేసేందుకు టెర్రరిస్టులు కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలినడకన వచ్చినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఉగ్రవాదులు స్థానికుడి నుంచి ఒకటి, పర్యాటకుడి నుంచి మరొకటి మొబైల్ ఫోన్లు దొంగలించినట్లు తేలింది. ఈ మారణహోమంలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వారిలో ముగ్గురు విదేశీయులు కాగా, మరొకడు స్థానిక ఉగ్రవాది ఆదిల్ థోకర్గా గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
అనంత్నాగ్ జిల్లాలోని బిజ్బెహారాకు సమీపంలోని గురీ అనే చిన్న గ్రామానికి చెందిన ఆదిల్ టీనేజ్లో ఉండగానే పలు నిషేధిత ఉగ్ర సంస్థలకు అనుగుణంగా పనిచేశాడు. 2018లో దక్షిణ కశ్మీర్లో ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అదే ఏడాది పాకిస్థాన్ నుంచి విద్యార్థి వీసా సాధించి వాఘా సరిహద్దు దాటాడు. అలా వెళ్లిన అతడు ఉగ్రవాదిగా శిక్షణ పొంది, తిరిగివచ్చి సొంతగడ్డపైనే అకృత్యాలకు పాల్పడ్డాడు. తాజాగా విదేశీ ఉగ్రవాదులతో కలిసి సొంతగడ్డపై 26 మంది పర్యాటల హత్యలకు కారకుడయ్యాడు.
కాగా, ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేస్తున్నపుడు అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ దాడినంత తన కెమెరాలో చిత్రీకరించాడు. ఆ ఫొటో గ్రాఫర్ లోయకు వచ్చిన వాళ్లను ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా లోయకి వచ్చి పర్యాటకులను వీడియో తీస్తూ ఉండగా ఉగ్రవాదులు అక్కడికి వచ్చి కాల్పులు జరపటం ప్రారంభించడంతో భయంతో బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న ఓ చెట్టు మీదకు ఎక్కాడు.
అక్కడే ఓ కొమ్మపై కూర్చుని ఉగ్రదాడినంతా వీడియో తీశాడు. ఆ ఫొటో గ్రాఫర్ ఉగ్రదాడి ఘటనలో కీలక సాక్షిగా మారాడు. ఎన్ఐఏ అధికారులు ఆ ఫొటో గ్రాఫర్ను విచారిస్తున్నారు. అతడి వద్దనుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారికి సాయం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఉగ్రవాదులు ఏకే47, ఎం4 ఎసాల్ట్ రైఫిల్లతో మారణహోమానికి పాల్పడినట్టు ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలింది.
More Stories
మరో పాక్ దౌత్యాధికారిపై భారత్ వేటు
5 ఏళ్ల తర్వాత 720 మందితో కైలాస మానస సరోవర యాత్ర
భారత్ లో 257 యాక్టివ్ కరోనా కేసులు