ఓటిటి, సోషల్‌ మీడియాలో అశ్లీల కంటెంట్‌పై సుప్రీం నోటీసులు

ఓటిటి, సోషల్‌ మీడియాలో అశ్లీల కంటెంట్‌పై సుప్రీం నోటీసులు
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం సహా పలు ఓటీటీ, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం.  జస్టిస్ బీఆర్‌ గువాయ్‌, జస్టిస్ అగస్టీన్‌ జార్జ్ మసిహ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ నోటీసులు జారీ చేసింది.
ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు నేషనల్ కంటెంట్‌ కంట్రోల్‌ అథారిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలు జారీ చేయాలని ఐదుగురు పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు.  ఈ క్రమంలోనే దీనిపై సరైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్నింటిని అమలు చేస్తామని కేంద్రం తరఫు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బదులిచ్చారు.

మరోవైపు ఈ పిటిషన్‌పై విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ కారణంగా పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలు కూడా కలుషితం అవుతాయని అభిప్రాయపడింది. ఇది వికృతమైన, అసహజమైన లైంగిక ధోరణులకు దారితీస్తుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 

దేశంలో నేరాల రేటు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా విచారణ సమయంలో పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల పరిధిలోని ఒక ముఖ్యమైన సమస్యను పిటిషనర్‌ లేవనెత్తారు. దీనిపై జస్టిస్ బీఆర్‌ గువాయ్‌ స్పందిస్తూ ఇప్పటికే పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామని తమపై ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు.