పహల్గాం ఉగ్రదాడి ఘటనపై  ఎన్ఐఎ దర్యాప్తు

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై  ఎన్ఐఎ దర్యాప్తు
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తుండగా  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును జమ్మూకశ్మీర్‌ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారికంగా తీసుకుంది. ఇప్పటికే పహల్గాంలోని ఘటనాస్థలంలో ఉన్న ఎన్‌ఐఏ బృందాలు విచారణను ముమ్మరం చేశాయి.

ఉగ్రవాదులను చూసిన పర్యటకులను పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారిస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. అక్కడ వారు తీసుకున్న ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. 

పర్యటన సమయంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. పహల్గాంలోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలను ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పహల్గాంలోని బైసరన్‌ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపిన విషయం తెలుసుకొని తొలుత సీఆర్పీఎఫ్‌ సిఆర్పిఎఫ్ క్విక్‌ యాక్షన్‌ టీమ్‌ స్పందించింది. 

25 మంది కమాండోలతో కూడిన బృందం రాళ్లు, బురద మార్గంలో దాదాపు 40-45 నిమిషాలు ట్రెక్కింగ్‌ చేసి ఘటనాస్థలానికి చేరుకుంది. వెంటనే పహల్గాం చుట్టూ సీఆర్పీఎఫ్‌ యూనిట్‌ చెక్‌పోస్టులు, ఘటనాస్థలానికి సమీపంలో సురక్షిత పాయింట్లను ఏర్పాటు చేసింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించారు.

ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన ఐజి,డిఐజి, ఎస్‌పిల పర్యవేక్షణలో తమ బృందాలు ప్రత్యక్షసాక్షులను విచారిస్తున్నాయని ఎన్‌ఐఎ ప్రతినిధి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బైసరన్‌ లోయ ప్రవేశ, నిష్క్రమణ దారులను నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఫోరెన్సిక్‌, ఇతర నిపుణుల సాయంతో దాడి జరిగిన ప్రాంతాన్ని తమ బృందాలు జల్లెడ పడుతున్నాయని పేర్కొన్నారు.