పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు

పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు
 
హైదరాబాద్‌లో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ మరోసారి చేపట్టిన సోదాలు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, అలాగే సర్ఫాన్, సుకుర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా‌లు భూదాన్ ల్యాండ్‌ను అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకం చేశారు. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్‌ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇందులో సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది. ఈ 50 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో వారు ఇందులో ప్లాట్లుగా విభజించి ప్రస్తుతం అమ్మకాలు చేపట్టారు. 
 
అయితే ఈ అంశం కోర్టులో పరిధిలో ఉండడంతో ఆ భూములకు సంబంధించి లావాదేవీలపై స్టే విధించింది. ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం కావడంతో దీనిపై విజిలెన్స్ విచారణ జరిగిన తరువాత, ఆ నివేదిక ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 
ఈ వ్యవహారంలోనే గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమయ్ కుమార్‌‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి పలుమార్లు విచారించింది కూడా. అంతేకాకుండా అప్పటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి విచారించింది ఈడీ. చాలా కాలం తర్వాత మళ్లీ భూదాన్ భూముల వ్యవహారంపై ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది.
 
అందులో ఎవరెవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో వాటిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు విక్రయించారో, భూదాన్ భూములను కొనుగోలు చేసి వేరేవారికి విక్రయించిన వారిపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పాతబస్తీలో సోదాలు జరుగుతున్నాయి. యాకత్‌పూర, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పాతబస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, సర్ఫాన్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి.
ఈ కేసులో ఖదీర్ ఉన్నీసా పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఖదీర్ ఉన్నీసా తండ్రి ఈ 50 ఎకరాల భూమిని గతంలో భూదాన్ బోర్డుకు దానంగా ఇచ్చారు. 2021లో ఈ ఖదీర్‌ ఉన్నీసా తన తండ్రికి వారసురాలు తానే అంటూ వచ్చి 50 ఎకరాలు బదిలీ చేయాలంటూ అర్జీ పెట్టుకుంది. ఆ వెంటనే ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు 50 ఎకరాల భూమిని ఖదీర్ ఉన్నీసా పేరు మీద రిజిస్ట్రర్ చేశారు. 
 
ఆ సమయంలో జిల్లా కలెక్టర్‌గా అమయ్ కుమార్‌తో పాటు కిందస్థాయి సిబ్బంది కూడా హడావుడిగా, ఎలాంటి విచారణ జరుపకుండా 50 ఎకరాల భూమిని ఖదీర్ ఉన్నిసా పేరు మీద బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఖదీర్ ఉన్నిసాతో పాటు మరికొంత మంది 50 ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి చాలా మందికి విక్రయించారు. ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భూములు కొనుగోలు చేశారు. ఐఏఎస్‌‌లు, ఐపీఎస్‌లు కూడా భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 
 
నాగారం, మహేశ్వరం ప్రాంతాల్లో భూముల రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. మరోవైపు భూదాన్‌‌కు సంబంధించి భూములు క్రయ విక్రయాలు చేసేందుకు అవకాశం ఉండదు. ఈ క్రమంలో ఖదీర్ ఉన్నిసాకు త్వరితగతిన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం వెనక కారణాలేంటి అనే దానిపై ఇప్పటికే అధికారులు పలు మార్లు విచారణ జరిపి, అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్‌తో పాటు మిగిలిన వారి వద్ద స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే ప్లాట్లు విక్రయించారో, ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వారి ఇళ్లను టార్గెట్ చేసుకుని సోదాలు కొనసాగిస్తున్నారు.