గాయని నేహా రాథోడ్‌పై దేశ‌ద్రోహం కేసు

గాయని నేహా రాథోడ్‌పై దేశ‌ద్రోహం కేసు

* పాకిస్థాన్‌ యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం, బిబిసికి నోటీసులు

జాన‌ప‌ద గాయ‌ని నేహా సింగ్ రాథోడ్‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని పెహల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో ఆమె ప‌లు పోస్టులు చేసింది. వాటిల్లో ఆమె ఓ మ‌త వ‌ర్గాన్ని టార్గెట్ చేసింది. దీంతో ఆమెపై ఫిర్యాదు న‌మోదు అయ్యింది. అభ‌య్ ప్ర‌తాప్ సింగ్ అనే వ్య‌క్తి ఆ సింగ‌ర్‌పై కేసు పెట్టారు. జాతి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసింద‌ని, మ‌త ఘ‌ర్ష‌ణ‌లు ప్రోత్ర‌హించేలా ఆ వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లు ఫిర్యాదులో  ఆరోపించారు.
నేహా సింగ్ రాథోడ్ ఓ పొలిటిక‌ల్ సెటైరిస్ట్‌. జాన‌ప‌ద గాయ‌ని కూడా. భోజ్‌పురి పాట‌లు ఆమె పాడుతుంది. 1997లో పుట్టిందామె. బీహార్‌లోని జ‌న్‌దాలో పెరిగింది. 2018లో ఆమె కాన్పూర్ వ‌ర్సిటీ నుంచి బిఎస్సీ ప‌ట్టా పొందింది. 2019లో బోజ్‌పురి పాట‌లు పాడ‌డం ప్రారంభించింది. మొబైల్ ఫోన్‌లో రికార్డింగ్ చేసేది. వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసేది. భోజ్‌పురి క‌వులు బికారి థాకూరి, మ‌హేంద‌ర్ మిస్రిలు త‌న‌కు ఇన్స్‌పిరేష‌న్ అని చెబుతోంది.

2020 మే నెల‌లో ఆమె యూట్యూబ్ ఛాన‌ల్ స్టార్ట్ చేసింది. కరోనా గురించి అప్పుడు హైలెట్ చేసిందామె. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్ట‌ర్‌లో త‌న వీడియోలు షేర్ చేసింది. అక్టోబ‌ర్ 2020 నాటికి రాజ‌కీయ విమ‌ర్శ‌కురాలిగా ఆమెకు గుర్తింపు వ‌చ్చింది. 2021 నాటికి ఆమె యూట్యూబ్ ఛాన‌ల్‌కు ల‌క్ష మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు వ‌చ్చేశారు. 

బీహార్ మే కాబా, యూపీ మే కా బీ, యూపీ మే కాబా సీజ‌న్ 2, ఎంపీ మే కాబా పాటలు పాడిందామె. అవ‌న్నీ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యాయి. 2023 జూలైలో ఆమె వివాదంలో ఇరుక్కున్న‌ది. ఓ గిరిజ‌న కార్మికుడిపై మూత్రం పోసిన వీడియోతో ఆమె మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ పాపులరైంది. భార‌తీయ న్యాయ సంహిత చ‌ట్టం కింద ప్ర‌స్తుతం నేహ సింగ్‌పై కేసు బుక్ చేశారు. ల‌క్నోలోని హ‌జ్ర‌త్‌గంజ్ పోలీసు స్టేష‌న్‌లో కేసు రిజిస్ట‌ర్ చేశారు.

కాగా, పెహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్‌ నటుల సినిమాలు నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశానికి చెందిన యూట్యూబ్‌ ఛానళ్లపై కూడా నిషేధం విధించింది. దాదాపు 16 యూట్యూబ్‌ ఛానళ్లపై వేటు వేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

 
పెహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్‌ వ్యాప్తి, అలాగే భారత దేశం, భారత సైన్యం, భద్రతా సంస్థలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు, తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. 
 
వీటిలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తోపాటు డాన్ న్యూస్, సమా టీవీ, ఆరీ న్యూస్‌, జియో న్యూస్‌ వంటి ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. ఆయా యూట్యూబ్‌లను యాక్సెస్‌ చేయగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లలో సందేశం కనిపిస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీకి కూడా కేంద్రం నోటీసులు పంపింది. పాక్‌కు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడంతో నోటీసులు జారీ చేసింది.