మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన

మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన
 
ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. మూడు ఏళ్లలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, అమరావతి పనులు మొత్తం పూర్తయి తీరాల్సిందేనని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 
 
అందుకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచామని ఆయన చెప్పారు. దీంతో మోదీ శంకుస్థాపన అనంతరం రాజధాని అమరావతి పనులు ఊపందుకొన్నున్నాయి. మరోవైపు ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు జరుగుతోన్నాయి. ఈ మాసాంతం నుంచి అవి మరింత శరవేగంగా జరుగుతాయని ఇప్పటికి మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ సోమవారం వెల్లడించారు.

2015, అక్టోబర్ 22వ తేదీన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అందుకు సంబంధించిన పనులు శరవేగంగా ప్రారంభమైయ్యాయి. ఆయా పనులకు కొనసాగుతుండగా, ఇంతలో 2019 అసెంబ్లీ ఎన్నికలలో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి `మూడు రాజధానులు’ పేరుతో అమరావతి కట్టడాల పనులను మూలాన పడవేశారు. 

తిరిగి గత ఏడాది మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం ప్రోజెక్టుల నిర్మాణం తన తొలి ప్రాధాన్యతలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పైగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో టిడిపి, జన సేనలు కూడా కీలక భాగస్వాములు కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ వస్తున్నది.

ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, నాబార్డ్ వంటి సంస్థల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. దానితో అమరావతి నిర్మాణపు పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయి. మరోవంక, దక్షిణాది రాష్ట్రాలలో విస్తరించాలని చూస్తున్న బిజెపికి సహితం ఈ ప్రాజెక్టులు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి.  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించి, వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేసేందుకు అన్నా ఎఐఎడిఎంకెతో ఎన్నికల పొత్తు కుదురఃసుకున్న కొద్దీ రోజులకే మోదీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు రావడం గమనార్హం.