అరుదైన ఖనిజాలు, లోహాల ఎటుమతులు నిలిపేసిన చైనా

అరుదైన ఖనిజాలు, లోహాల ఎటుమతులు నిలిపేసిన చైనా
అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం కావడంతో అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను ఎగుమతి చేయడాన్ని డ్రాగన్‌ కంట్రీ నిలిపివేసింది. దాంతో పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్స్‌, ఏరోస్పేస్‌ తయారీ కంపెనీలు, సెమీకండక్టర్స్‌ కంపెనీలకు సమస్యలు ఎదురుకానున్నాయి.  ఎగుమతులకు సంబంధించిన నూతన నిబంధనలను చైనా రూపొందిస్తోంది.
అప్పటివరకు చైనా పోర్టుల నుంచి మాగ్నెట్‌ల ఎగుమతులను నిలిపివేశారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీలకు శాశ్వతంగా మాగ్నెట్‌ల సరఫరా నిలిచిపోనుంది. దాదాపు ప్రతీ వస్తువు తయారీలో కీలకమైన అయస్కాంతాల రవాణా స్థంభించడంతో తయారీ రంగంపై పెను ప్రభావం పడుతుందని సమాచారం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతి స్పందనగానే కీలక విడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై ట్రంప్‌ 54 శాతం టారిఫ్‌లను విధించారు. వీటిని కాకుండా పర్మినెంట్‌ మాగ్నెట్‌లు, ఇతర ఉత్పత్తులను కూడా నిలిపేశారు. ఈ లోటును భర్తీ చేసుకోవడం అగ్రరాజ్యానికి ఇబ్బందికరంగా మారనుంది. 

అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్‌ ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నది. చైనా తాజాగా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాదు. అన్ని దేశాలపై ఉండనుంది.

కీలక ఖనిజాల మైనింగ్‌, ప్రాసెసింగ్‌లో తనకున్న శక్తిని చైనా ఆయుధంగా వాడుతోంది. దాంతోపాటు ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌లను పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాక్‌హీడ్‌ మార్టిన్‌, టెస్లా, యాపిల్‌ లాంటి సంస్థలు చాలా ముడిపదార్థాల కోసం బీజింగ్‌పైనే ఆధారపడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం వద్ద రేర్‌ఎర్త్‌ మినరల్స్‌ నిల్వలు ఇప్పటికే ఉన్నాయి.

అమెరికాలోని రక్షణ రంగంతో పాటు పలు ఇతర పరిశ్రమలకు చైనా నుండి జరుగుతుతన్న దిగుమతులే కీలక ఆధారం. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదలు పెట్టిన టారిప్‌ల యుద్ధంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజాలు, లోహాల్లో దాదాపు 90 శాతం చైనానే తయారు చేస్తుంది.  వీటిలో 17 మూలకాలను రక్షణ, ఎలక్ట్రిక్‌ వెహికల్‌, ఇంధన, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో వాడతారు.

దశాబ్దాలుగా చైనాపై ఆధారపడుతూ వచ్చిన కీలకమైన ఖనిజాలు, ఇతర సరఫరాలు నిలిచిపోవడం తో అమెరికన్‌ తయారీ రంగం అల్లకల్లోలమవుతుంది. ఎలక్ట్రిక్‌ కార్లు, డ్రోన్లు, రోబొట్లు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, గాసోలిన్‌తో నడిచే కార్లు తయారీలో చైనా నుండి దిగుమతయ్యే లోహాలు అత్యంత కీలకమైనవి. అదే విధంగా జెట్‌ ఇంజన్లు, లేజర్లు, కార్‌ హెడ్‌లైట్లు, కొన్ని స్పార్క్‌ ప్లగ్‌లు, కేపాసిటర్లు తయారీలో కూడా ఈ లోహాలు అవసరమవుతాయి.

న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనం ప్రకారం ఈ తరహా లోహాలు, అయస్కాంతాల ఎగుమతికి చైనా ప్రత్యేక లైసెన్స్‌ విధానాన్ని రూపొందించనుంది. అయితే, ఆ విధానం పూర్తి స్థాయిలో అమలులోకి రావడానికి మరింత సమయం పట్టనుంది.