24 శాతం పెరిగిన ఎంపీల జీతాలు

24 శాతం పెరిగిన ఎంపీల జీతాలు
పార్లమెంట్‌ సభ్యుల వేతనాలు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంపీల జీతాలతోపాటు అలవెన్సులు, ఫించన్లను సైతం సవరించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పెరిగిన వేతనాలు, అలవెన్సులు 2023 ఏప్రిల్ ఒకటి నుంచి వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది.  అంటే రెండేళ్ల బకాయిలను కూడా కేంద్రం ఎంపీలకు చెల్లించనుంది.
 
లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నెలవారీ వేతనం ప్రస్తుతం రూ.లక్ష ఉండగా, పెంపుతో రూ.1.24 లక్షలకు చేరింది. రోజువారీ భత్యం రూ.2వేల నుంచి రూ.2,500కి పెరిగింది. మాజీ ఎంపీల పెన్షన్‌ నెలకు రూ.25వేల నుంచి రూ.31వేలకు చేరింది. ఐదేళ్ల సర్వీస్‌ తర్వాత ప్రతి సంవత్సరం అదనపు పింఛన్‌ను రూ.2వేల నుంచి రూ.2,500 పెంచినట్లు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
 
పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల సమయంలో ఎంపీల జీతాలు, అలవెన్సులు, పింఛన్ల పెంపును ప్రకటించడం విశేషం. ఇంతకు ముందు 2018 ఏప్రిల్‌లో సిట్టింగ్, మాజీ ఎంపీలకు చెల్లించే జీతం, అలవెన్సులను కేంద్రం సవరించింది.  ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఎంపీల మూల వేతనాన్ని నెలకు రూ.లక్షగా నిర్ణయించింది. 
 
2018 సవరణ ప్రకారంగా, వేతనానికి అదనంగా ఎంపీలు కార్యాలయ నిర్వహణ, ఓటర్లతో సంబంధాలు కొనసాగించేందుకు నియోజకవర్గ భత్యంగా రూ.70వేలు పొందుతూ వస్తున్నారు. దాంతో పాటు నెలకు కార్యాలయ భత్యంగా రూ.60వేలు, పార్లమెంట్‌ సమావేశాల సమయంలో రోజువారీ భత్యంగా రూ.2వులు అందుకుంటున్నారు.  తాజాగా అలవెన్సులు సైతం పెరగనున్నాయి. 
 
వీటితో పాటు ఎంపీలకు ఫోన్, ఇంటర్‌నెట్‌ కోసం వార్షిక భత్యం కేంద్రం చెల్లిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంవత్సరానికి 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు, వృత్తిపరమైన, వ్యక్తిగత ఉపయోగం కోసం ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం సైతం చేసేందుకు అవకాశం కల్పించింది. రోడ్డు మార్గం ద్వారా వెళితే అలవెన్స్ సైతం పొందొచ్చు. 
 
ఎంపీలు సంవత్సరానికి 50 వేల యూనిట్ల ఉచిత విద్యుత్, నాలుగు వేల కిలో లీటర్ల నీటిని పొందుతారు. ఒకవేళ సొంత ఇల్లు ఉండి కేంద్రం నుంచి అద్దె తీసుకోకపోతే బిల్లులు పెట్టుకొని కేంద్రం నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసుకోవచ్చు. ఇలా ఎంపీల జీతాలను ప్రతి ఐదేళ్లకు పెంచాలని 2023 ఏప్రిల్ 1ని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు పెంచినట్టు ఇప్పుడు గెజిట్‌నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.