ముగ్గురితో వాణిజ్య ఒప్పందాలపై మాట్లాడుతున్నాం

ముగ్గురితో వాణిజ్య ఒప్పందాలపై మాట్లాడుతున్నాం

వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రస్తుతం మూడు ప్రధాన సంప్రదింపుల్లో పాల్గొంటున్నదని, వాటిలో ఒకటి అమెరికాతో అని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ముంబయిలో ‘బిజినెస్ టుడే మైండ్ష్ రష్ 2025’ సదస్సులో చెప్పారు. 

“ప్రపంచ ఆర్థిక వ్యవహారాల సంప్రదింపుల సంగతికి వచ్చినప్పుడు వాణిజ్య ఒప్పందాలు ఎల్లప్పుడూ ప్రధాన స్థానం ఆక్రమిస్తుంటాయి. ఇది ఇప్పుడు మరింతగా ఉన్నది. ఈ వాస్తవాన్ని భారత్ గుర్తించి తీరాలి” అని తెలిపారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ (ఇయు), యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎలు), అమెరికాతో  ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ)పై చర్చలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. 

ఈ వారమే మేము న్యూజిలాండ్‌తో కూడా సంప్రదింపులు ప్రారంభించామని జైశంకర్ గుర్తు చేశారు. మరికొన్ని దేశాలతో కూడా జరుపబోతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.  ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదరించిన తర్వాత భారత్ ప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది. 

సునిశిత టెక్నాలజీలను భారత్ పొందే విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని జైశంకర్ చెప్పారు. ‘భారత్ ప్రథమం’ విధానాన్ని తాము అనుసరిస్తామని జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ విషయంలో భారత్ ప్రథమం దృక్పథంతో ముందుకు సాగుతామని, ఈ సంబంధాల్లో ఇప్పటి వరకు అందుకోని సామర్థ్యాలను సాధించే అవకాశం గురించి కూడా ఆలోచనలు ఉంటాయని ఆయన తెలిపారు.

“ఇంతకు ముందు మా ఎఫ్‌టిఎలలో చాలా వరకు ఆసియా ఆర్థిక వ్యవస్థలతో ఉన్నాయి. వాటిలో అనేకం పోటీ లక్షణంతో ఉన్నాయి. గల్ఫ్, పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలతో సంప్రదింపుల ద్వారా సమతూకం సాధించడం ఆర్థికంగా లాభదాయకం కావడమే కాకుండా వ్యూహాత్మకం కూడా” అని మంత్రి వివరించారు.  కాగా, పరస్పవర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందానికి వచ్చేందుకు ‘వివిధ స్థాయిల్లో’ అమెరికా ప్రభుత్వంతో భారత్‌తో సంప్రదింపులు సాగిస్తూనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌జైశ్వాల్ శుక్రవారం తెలియజేశారు.