బెట్టింగ్ యాప్ ప్ర‌మోట్ చేసిన హైద‌రాబాద్ మెట్రో!

బెట్టింగ్ యాప్ ప్ర‌మోట్ చేసిన హైద‌రాబాద్ మెట్రో!
 
* ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన అన‌న్య నాగ‌ళ్ల‌
బెట్టింగ్ యాప్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల‌ను కుదిపేస్తున్నది.ఇప్ప‌టికే ఈ విష‌యంలో తెలంగాణ పోలీసులు ప‌లువురిపై కేసు న‌మోదు చేశారు. ఇందులో న‌టులు రానా ద‌గ్గుబాటితో పాటు ప్ర‌కాశ్ రాజ్, విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌న్య నాగ‌ళ్ల‌, సిరి హనుమంతు, శ్రీముఖి, శోభా శెట్టి త‌దిత‌ర న‌టులపై కేసు న‌మోదు చేశారు. 
 
బెట్టింగ్ యాప్‌లు చట్టవిరుద్ధంగా న‌డుస్తుండ‌టంతో వీటిని ప్రమోట్ చేయడం వల్ల సామాన్య ప్రజలు మోసపోతున్నారని పోలీసులు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. ఈ యాప్‌లలో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.

ఇదిలావుంటే న‌టి అన‌న్య నాగ‌ళ్లను బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేసినందుకు సోష‌ల్ మీడియాలో తిట్టడం మొద‌లుపెట్టారు. అయితే త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఆమె తీవ్రంగా తిప్పికోట్టింది.  బెట్టింగ్ యాప్స్ ప్ర‌భుత్వమే ప్ర‌మోట్ చేస్తుంటే మాకేలా తెలుస్తుంది? అంటూ ఆమె ప్ర‌శ్నించింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ మెట్రో ప్ర‌మోట్ చేస్తున్న వ‌న్ ఎక్స్ బెట్టింగ్  యాప్ ఫొటోను పంచుకుంది. 

ప్ర‌భుత్వానికి చెందిన సంస్థ (హైద‌రాబాద్ మెట్రో) బెట్టింగ్ యాప్‌ను ప్ర‌మోట్ చేస్తుంటే అవి చట్టవిరుద్ధంగా ప్రమోట్ చేయబడుతున్నాయని మనం ఎలా తెలుసుకోవాలి? అంటూ అన‌న్య ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. మ‌రోవైపు తాను బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేసినందుకు క్ష‌మాప‌ణ‌లు తెలిపింది అన‌న్య‌. 

“దయచేసి నన్ను క్షమించండి. నేను తెలిసి తప్పు చేయలేదు. అందరూ టాప్ సెలబ్రిటీలు చేస్తున్నారు కాబట్టి తప్పు కాదని అనుకున్నాను. ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటాను. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తాను” అంటూ ఆమె చెప్పుకొచ్చారు. 

“అప్పట్లో ఆలోచన లేకుండా, అవగాహన లేని స్థితిలో ఈ పని చేశాను. ఒక వీడియో స్టోరీ పోస్ట్ చేసినందుకు వాళ్లు రూ.1,20,000 చెల్లించారు. అప్పుడు నేను దాన్ని కేవలం గేమింగ్ యాప్‌గా, ఒక సాధారణ యాడ్‌గా మాత్రమే చూశాను. కానీ అది బెట్టింగ్ యాప్ అని, దీని వెనుక ఇన్ని సమస్యలు ఉంటాయని అప్పట్లో గ్రహించలేకపోయాను. తర్వాత వాళ్లు ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి ఇచ్చేశాను” అంటూ అన‌న్య వెల్లడించారు.