
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ నటి రన్యా రావు కేసు విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనను స్మగ్లింగ్ కోసం గుర్తుతెలియని వ్యక్తులు వాడుకున్నారని గతంలో ఆమె చెప్పిన విషయం అబద్ధం అని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచారణలో బయటపడింది. ఆమే నేరుగా స్మగ్లింగ్కు పాల్పడ్డారని, ఈ కేసులో ఆర్థిక నేరాలు, హవాలా వ్యవహారాలు, కుట్ర కోణాలు ఉన్నాయని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి.
ఓ కంపెనీని స్థాపించి దాని ద్వారా బంగారం స్మగ్లింగ్ చేశారని తేలినట్లు వెల్లడించాయి. రన్యా రావు కేసులో రెండో నిందితుడిగా ఉన్న నటుడు తరుణ్ రాజ్ కొండూరుని కూడా డీఆర్ఐ విచారించింది. డీఆర్ఐ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం తరుణ్ రాజ్తో కాలేజీ రోజుల నుంచి రన్యా రావుకు పరిచయం ఉంది. వారిద్దరూ కలసి వీర డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ పేరుతో 2023లో దుబాయ్లో చెరిసగం భాగస్వామ్యంతో ఓ బంగారం వ్యాపారం కంపెనీని నెలకొల్పారు.
అమెరికా పౌరసత్వం ఉన్న తరుణ్ రాజ్ ఆ కంపెనీలో వర్కింగ్ పార్టనర్గా ఉంటూ రన్యా తరఫున వ్యవహారాలు నడిపాడు. అంతర్జాతీయంగా బంగారం వ్యాపారాన్ని విస్తరించడానికి రన్యా రావు తన కుటుంబ సంబంధాలను వినియోగించుకుంది. తన వ్యాపారాన్ని సజావుగా కొనసాగించేందుకు బ్యాంకాక్, జెనీవాల్లోని ముఖ్యమైన క్లయింట్లతో ఆమె గట్టి సంబంధాలు నెరిపింది.
దోహా, జెనీవాల్లో ఆమె హోల్ సేల్ సప్లయర్ల నుంచి బంగారం కడ్డీలను కొనుగోలు చేసి దుబాయ్ ఖాతాల ద్వారా విదేశీ కరెన్సీని చెల్లించింది. దుబాయ్కి బంగారం దిగుమతి చేసుకుని అక్కడ పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత బంగారాన్ని భారత్కు తరలించడం.. ఇదే రన్యా, తరుణ్ ప్రణాళిక. వీరి కంపెనీకి ప్రధాన పెట్టుబడిదారు రన్యానే. ఆ కంపెనీలో పెట్టిన రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలను ఆమె తన హెచ్డీఎ్ఫసీ ఖాతా నుంచి మళ్లించారు.
ఆమె దుబాయ్ రెసిడెంట్ కార్డును కూడా పొందడంతో ఇక యూఏఈ వీసా అవసరం లేకపోయింది. ఆ కార్డు ద్వారా తరచూ బంగారం కొనుగోళ్లు కూడా సులువయ్యాయి. ఏప్రిల్ 2024 నుంచి ప్రధానంగా జెనీవా, బ్యాంకాక్ల నుంచి బంగారం ఆమె కంపెనీకి దిగుమతులు జరిగాయి. దీనికోసం తరుణ్ రాజ్కు ఉన్న అమెరికా పాస్పోర్టును కూడా రన్యా రావు వినియోగించుకున్నారు. ఈ స్మగ్లింగ్ రాకెట్లో పెద్దఎత్తున ఆర్థిక నేరాలు కూడా ఉన్నాయి.
గడిచిన ఏడాదిలో రన్యా రావు కనీసం 27 సార్లు విదేశాలకు వెళ్లి వచ్చారు. రన్యా గత రెండేళ్లలో 52 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చింది. అందులో 26 సార్లు ఆమెతో పాటు నటుడు, హోటల్ వ్యాపారి తరుణ్ రాజు కూడా ఉన్నాడు. వీరు ప్రతిసారి ఉదయం దుబాయ్కు వెళ్లడం, సాయంత్రానికి తిరిగి రావడం చేసేవారు. వీరి ప్రయాణ వివరాలు పోలీసులకు అనుమానం కలిగించాయి.
వీరిద్దరూ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులకు అనుమానం వచ్చింది. ముందుగా రన్యాను అరెస్ట్ చేశారు. అనంతరం తరుణ్ రాజును కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే బంగారంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కస్టమ్స్కు సమాచారం ఇవ్వకుండా ప్రతిసారి ఆమె బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు. సోదాల్లో ఆమె ఇంటి నుంచి డీఆర్ఐ అధికారులు పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దానిలో రెండు దుబాయ్ కస్టమ్స్కు సబంధించిన పత్రాలు కూడా ఉన్నాయి.
జెనీవాకు బంగారం ఎగుమతి చేస్తున్నట్లు ఆ పత్రాల్లో ఉంది. అయితే జెనీవాకు ఆ బంగారం చేరలేదని విచారణ అధికారులు గుర్తించారు. రన్యా రావు పెంపుడు తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావును డీఆర్ఐ విచారించనుంది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను