
ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజిలాండ్తో కలిసి పనిచేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ సోమవారం న్యూఢిల్లీలో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఒప్పందాల మార్పిడిని వీక్షించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ ముంబయి ఉగ్రదాడులు, క్రిస్ట్ చర్చిపై దాడి అంశాల్లో భారత వైఖరి స్పష్టమని చెప్పారు. 2008 ముంబయి ఉగ్రదాడులు, 2019 క్రైస్ట్చర్చ్ దాడి వంటి ఘటనల్లో భారత వైఖరి మౌలికంగా ఒకటేనని, ఇటువంటి ఘోరమైన ఘటనలపై భారత్-న్యూజిలాండ్ కలిసి పనిచేస్తాయని మోదీ తెలిపారు. ఉగ్రవాదాన్ని రూపుమాపే చర్యల కోసం న్యూజిలాండ్తో సమన్వయం మరింత బలపడుతుందని ఆయన చెప్పారు.
2019లో న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ పై జరిగిన ఉగ్రదాడిలో 51 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రస్తావించిన మోదీ, ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా అంతర్జాతీయ సహకారంతో కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుదముట్టించే దిశగా భారత్- న్యూజిలాండ్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
“ఉగ్రవాదంపై మా ఇద్దరిది (న్యూజిలాండ్ ప్రధాని) ఒకే అభిప్రాయం. 2019 మార్చి15న క్రైస్ట్ చర్చిపై ఉగ్రదాడి జరిగినా లేదా 2008 ముంబయి దాడులు అయినా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న ఆమోదయోగ్యం కాదు. ఉగ్రవాదానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై భారత్, న్యూజిలాండ్ కలిసి పనిచేస్తాయి. న్యూజిలాండ్లో భారత వ్యతిరేక కార్యకలాపాలపై మా ఆందోళనను తెలియజేశాం. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వ్యతిరేకంగా భారత్కు న్యూజిలాండ్ ప్రభుత్వం సాయం చేస్తుందని విశ్వసిస్తున్నా” అని ప్రధాని మోదీ తెలిపారు.
భారతదేశం విస్తరణ వాదాన్ని కాదు, అభివృద్ధి వాదాన్ని కోరుకుంటుందని మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను పెంచేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ భేటీ దోహదపడుతుందని ఇరు దేశాల ప్రధానమంత్రులు నమ్మకం వ్యక్తం చేశారు.ఈ భేటీ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, భవిష్యత్తులో భారత్-న్యూజిలాండ్ సంబంధాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించే దిశగా ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందంతో ఇరుదేశాలకు ఉపయోగపడే రీతిలో వాణిజ్య సామర్థ్యం పెరుగుతుందని, పాడిపరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాయి.
తాము అభివృద్ధివాదాన్ని కోరుకుంటున్నామని, విస్తరణవాదాన్ని కాదని ఇరు దేశాలు వెల్లడించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి భారత్, న్యూజిలాండ్ మద్దతిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ భేటీలో భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిపారు. భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు న్యూజిలాండ్లో మరింత సులభంగా అవకాశాలను పొందుతారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
పాకిస్తాన్ నటుడి సినిమాపై కేంద్రం నిషేధం
వేయి మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష