లాలూ యాదవ్‌, రబ్రీ దేవి, తేజ్‌ ప్రతాప్‌లకు ఈడీ సమన్లు

లాలూ యాదవ్‌, రబ్రీ దేవి, తేజ్‌ ప్రతాప్‌లకు ఈడీ సమన్లు
బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు.  తేజ్‌ ప్రతాప్‌, రబ్రీ దేవిని ఇవాళ ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. లాలూ ప్రసాద్‌ను మాత్రం బుధవారం పాట్నాలో హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు.
దీంతో ఈడీ ఆదేశాల మేరకు రబ్రీ దేవి నేడు పాట్నాలోని ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు.  ఈ సందర్భంగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు తెలిసింది. కాగా, ఇదే కేసులో లాలూ యాదవ్‌, తేజ్‌ ప్రతాప్‌, లాలూ కుమార్తె హేమా యాదవ్‌కు ఢిల్లీ కోర్టు ఇటీవలే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్‌ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా అనుకూలమైన వారిని రైల్వేలో నియమించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 

ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్‌లోని వివిధ రైల్వే జోన్స్‌లో కొంత మంది పాట్నా నివాసితులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. క్విడ్ ప్రోకో కింద ఆ అభ్యర్థులు లాలూ కుటుంబానికి చాలా తక్కువ ధరలకు భూమిని అమ్మినట్లు అభియోగాలు మోపాయి. అయితే ఈ ఆరోపణలను లాలూ కుటుంబం ఖండించింది.