ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ ను హతమార్చిన అమెరికా దళాలు

ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ ను హతమార్చిన అమెరికా దళాలు
 
ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ అబ్దుల్లా మక్కి మస్లిహ్ అల్‌ – రిఫాయి (అబూ ఖదీజా)ని అమెరికా, ఇరాకీ దళాలు సంయుక్తంగా వైమానిక దాడి జరిపి హతమార్చాయి. మార్చి 13వ తేదీన ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో అబూ ఖదీజా మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు. ఈ విషయాన్ని ఇరాక్‌ ప్రధానమంత్రి మహమ్మద్‌ షియా అల్‌ – సుడానీ ప్రకటించారు. 
 
ఇరాక్‌లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో అబు ఖదీజా ఒకరు. ఆయనను హతమార్చినట్లు ఇరాక్‌ ప్రధాని తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. కాగా, ఇరాక్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు, భద్రతా దళాలు, యుఎస్‌ కంట్రోల్‌ కమాండ్‌ (సిఇఎన్‌టిసిఓఎం)లు సంయుక్తంగా ఇరాక్‌లోని అల్‌ అన్బార్‌ ప్రావిన్స్‌లో మార్చి 13వ తేదీన వైమానిక దాడి జరిపాయి. 
 
ఈ దాడి జరిపిన సమయంలో అబు ఖదీజా ఆయుధాలతో ఆత్మాహుతికి ప్రయత్నించినట్లు సిఇన్‌టిసిఓఎం గుర్తించాయి. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తి డిఎన్‌ఎ అబు ఖదీజాదేనని అమెరికా దళాలు నిర్ధారించాయి.
 
ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ మృతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. ‘మన ధైర్యవంతులు, యుద్ధయోధులు అవిశ్రాంతంగా వేటాడి ఐఎస్‌ఐఎస్‌ నాయకుడిని హతమార్చారు. ఇరాక్‌ ప్రభుత్వం, కుర్దీస్‌ ప్రాంతీయ ప్రభుత్వ సమన్వయంతో ఇది జరిగింది’ అని ట్రంప్‌ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. బలం ద్వారానే శాంతి చేకూరుతుందని ఆయన పోస్టులో సందేశమిచ్చారు.