అమృత్‌స‌ర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి

అమృత్‌స‌ర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి

అమృత్‌స‌ర్‌లోని ఖాండ్వాలాలోని ఠాకూర్ద్వారా ఆలయంలో గ్రేనేడ్ దాడి జ‌రిగింది. శుక్ర‌వారం రాత్రి ఇద్ద‌రు వ్య‌క్తులు బైక్‌పై వ‌చ్చి హ్యాండ్ గ్రేనేడ్ విసిరిన‌ట్లు తెలిసింది. అర్థ‌రాత్రి గ్రేనేడ్ దాడి జ‌రిగిన‌ట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు. పేలుడు వ‌ల్ల ఆల‌య గోడ స్వ‌ల్పంగా ధ్వంస‌మైంది. ఎవ‌రికీ గాయాలు కాలేదు. పూజారి, అత‌ని కుటుంబం.. ఆ గుడి పైభాగాన ఉంటున్నారు. వాళ్ల‌కు ఎటువంటి హాని జ‌ర‌గ‌లేదు.

సీనియ‌ర్ పోలీసు అధికారుల ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌డుతున్నారు. న‌గ‌రంలో తొలిసారి మ‌త‌పర‌మైన ప్ర‌దేశంపై దాడి జ‌రిగిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. గ‌తంలో ఎక్కువ సార్లు అక్క‌డ పోలీసు స్టేష‌న్ల‌పై దాడులు జ‌రిగేవి. గ‌డిచిన నాలుగు నెల‌ల్లో గ్రేనేడ్ దాడి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం ఇది 12వ‌సారి. 

దాడిని స్థానిక నేత కిర‌ణ్‌ప్రీత్ సింగ్ ఖండించారు. పంజాబ్‌లో ఉన్న శాంతికి విఘాతం క‌లిగించే కుట్ర జ‌రుగుతోంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. తెల్ల‌వారుజామున రెండు గంట‌ల‌కు గుడి పూజారి త‌మ‌కు దాడి గురించిన చెప్పిన‌ట్లు అమృత్‌స‌ర్ పోలీసు క‌మీష‌న్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ తెలిపారు. 

పాకిస్థాన్‌కు చెందిన ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్‌(ఐఎస్ఐ)తో దాడికి లింక్ ఉండి ఉంటుంద‌ని భుల్లార్ అనుమానం వ్య‌క్తం చేశారు. పంజాబ్‌లో అల్ల‌ర్లు సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ స్థానిక యువ‌త‌ను వ‌ల వేస్తుంద‌న్నారు. యువ‌త త‌మ జీవ‌తాల‌ను నాశ‌నం చేసుకోవ‌ద్దు అని ఆయ‌న‌ వార్నింగ్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే నిందితుల్ని ప‌ట్టుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు.

కాగా, ఈ పేలుడు ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “పంజాబ్‌లో శాంతిని దెబ్బతీసేందుకు ఎల్లప్పుడూ అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, గ్యాంగ్‌స్టర్లు, దోపిడీ ఇలాంటివన్నీ ఇందులో భాగమే” అని తెలిపారు. 

“పంజాబ్‌ ఒక కల్లోలిత రాష్ట్రంగా మారిందని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హోలీ పండుగ సమయంలో ఇతర రాష్ట్రాల్లో పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. కానీ పంజాబ్‌లో అలాంటివి జరగలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగుంది’ అని ఆయన పేర్కొన్నారు.