ఓటుకు ఆధార్‌ లింక్‌పై 18న ఈసీ భేటీ

ఓటుకు ఆధార్‌ లింక్‌పై 18న ఈసీ భేటీ

ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. నకిలీ ఓటరు జాబితా ద్వారా బీజేపీ మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో గెలిచిందంటూ టీఎంసీ ఇటీవల ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఓట‌రు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంపై కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి, లెజిస్లేటివ్ సెక్ర‌ట‌రీతో పాటూ యూఐడీఏఐ సీఈవోతో భార‌త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి జ్ఞానేశ్ కుమార్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎలక్టోరల్ డేటాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఆధార్‌, ఓటరు కార్డు లింక్‌ చేయడంపై మార్చి 30లోగా సలహాలివ్వాలని అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలను ఈసీ ఇప్పటికే కోరింది. ఈ అంశంపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ ఖుమార్‌, ఇతర కమిషనర్లు కలిసి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, లెజిస్లేటివ్‌ విభాగ కార్యదర్శి రాజీవ్‌ మణి, ఆధార్‌ అధీకృత సంస్థ యుఐడిఎఐ సిఇఓ భువనేష్‌ కుమార్‌ చర్చించనున్నారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసిన తర్వాత ఆధార్‌ను ఓటర్‌ కార్డుకు అనుసంధానించారు. ఆ తర్వాత స్వచ్ఛంద ప్రాతిపదికన ఓటర్ల నుండి ఆధార్‌ నెంబర్లను సేకరించడం ఇసి ప్రారంభించింది. ఇప్పటికీ ఇసి ఇంకా రెండు డేటాబేస్‌లను అనుసంధానించాల్సివుంది. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు బూటకపు రిజిస్ట్రేషన్లను కనిపెట్టేందుకు ఈ ప్రక్రియ చేపట్టారు.

వివిధ శాఖల అధికారులతో సీఈసీ మంగళవారం సమావేశం అవనున్నారని ఆ శాఖ వర్గాలు తెలిపారు. సుమారు 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఓటర్ ఐడీ కార్డు డూప్లికేట్ సమస్యకు మూడు నెలల్లో చెక్ పెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏప్రిల్‌ 30లోగా అన్ని జాతీయ, రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి కూడా సూచనలు కోరతారని చెబుతున్నారు. 

అదేవిధంగా దీనిపై బూత్ స్థాయి ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లతో పాటూ ఎన్నికల ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఈసీ వర్గాలు తెలిపాయి.  ఓటర్ల జాబితాను ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానించేందుకు చట్టం అనుమతిస్తోందని అధికారులు చెబుతున్నారు.  ఓటర్ కార్డును ఆధార్‌తో ఆనుసంధానం చేసే అంశంపై ఎలాంటి గడువూ నిర్దేశించలేదని ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. అదేవిధంగా ఓటరు జాబితాలతో తమ ఆధార్ వివరాలను అనుసంధానించని వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించరని కూడా ప్రభుత్వం పేర్కొంది.