భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌ రద్దు

భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌ రద్దు

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను క్రీడా మంత్రిత్వ శాఖ మంగళవారం రద్దు చేసింది. ఫిర్యాదులపై డబ్ల్యుఎఫ్‌ఐ చర్యలు తీసుకుంది, దీంతో క్రీడలు, అథ్లెట్ల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా డబ్ల్యుఎఫ్‌ఐపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

డిసెంబర్‌ 21 ఎన్నికైన కొత్త సమాఖ్య పాలన మరియు నిర్వహణలో విధానపరమైన లోపాల కారణంగా క్రీడా శాఖ డబ్ల్యుఎఫ్‌ఐపై 2023 డిసెంబర్‌ 24న డబ్ల్యుఎఫ్‌ఐను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్‌ యుపిలోని గోండా జిల్లాలో నందిని నగర్‌లో అండర్‌ -15, అండర్‌ -20 క్రీడాకారులకు ఆతిథ్యం ఇస్తున్నట్లు ప్రకటించిన అనంతరం క్రీడా మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంది.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బిజెపి ఎంపి, డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై పలువురు రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. వినేష్‌ ఫోగట్‌, బజరంగ్‌పూనియా, సాక్షిమాలిక్‌ సహా పలువురు రెజ్లర్లు బ్రిజ్‌ భూషణ్‌ను డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా తొలగించాలని ఆందోళనలు సైతం చేపట్టారు. 

నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించడంలో విఫలమయ్యారంటూ 2023 ఆగస్టులో యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యుడబ్ల్యుడబ్ల్యు) డబ్ల్యుఎఫ్‌ఐపై నిషేధం విధించింది. రెజ్లర్ల నిరసనలతో అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఒఎ) తాత్కాలిక కమిటీని నియమించింది.

2023 డిసెంబర్‌లో నిర్వహించిన ఎన్నికల్లో డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజయ్ సింగ్‌ ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్‌ ఎన్నికను రెజ్లర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం అండర్‌ -15, అండర్‌ -20 క్రీడాకారులకు ఆతిథ్యం ఇస్తున్నట్లు ప్రకటించడంతో క్రీడల శాఖ డబ్ల్యుఎఫ్‌ఐను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.