
పన్ను తగ్గింపులు కోరవద్దని రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్ల పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి డబ్బు అవసరమని చెప్పారు.
జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని డిమాండ్ చేయొద్దని పేర్కొంటూఇది నిరంతర ప్రక్రియ అని, పన్నులు తగ్గిస్తే మరింత డిమాండ్ చేస్తారన్నాని పేర్కొన్నారు. ఇది మానవ మనస్తత్వం అని చెప్పారు. తాము పన్నులను తగ్గించాలని అనుకుంటున్నామని, కానీ పన్నులు లేకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేమని స్పష్టం చేశారు.
ధనవంతుల నుంచి పన్నులు తీసుకొని పేదలకు ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ దార్శనికత అని పేర్కొంటూ ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14-16 శాతంగా ఉందని, రాబోయే రెండేళ్లలోపు లాజిస్టిక్స్ ఖర్చు 9 శాతానికి తగ్గుతుందని హామీ ఇచ్చారు.
దాంతో అంతర్జాతీయ మార్కెట్లో మరింత పోటీతత్వాన్ని కలిగి ఉంటామని తెలిపారు. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8శాతం ఉండగా, అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఇది 12 శాతం ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా భారత పరిశ్రమ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మూలధన పెట్టుబడిని పెంచడం ద్వారా భారతదేశం మరిన్ని ఉద్యోగాలను సృష్టించబోతోందని గడ్కరీ చెప్పారు. ‘మీరంతా సంపద సృష్టికర్తలు మాత్రమే కాదు.. ఉద్యోగ సృష్టికర్తలు. ఈ స్వర్ణ యుగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని గడ్కరీ నొక్కి చెప్పారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి
ప్రపంచ వృద్ధిని దెబ్బ తీస్తున్న ట్రంప్ విధానాలు