
కన్నడ నటి రమ్య రావు బంగారం అక్రమ రవాణా కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (సిబిఐ) రంగంలోకి దిగింది. ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దాంతో వారు త్వరలోనే రన్యారావును విచారించే అవకాశం ఉంది. అలాగే దేశంలోని వివిధ విమానాశ్రయాల ద్వారా విదేశాల నుంచి భారత్ లోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న స్మగ్లర్లపై కేసు నమోదు చేసింది.
రన్యారావు అరెస్టు వెలుగులోకి రావడంతో మరిన్ని స్మగ్లింగ్ నెట్వర్క్లు అక్రమంగా ఇండియాకు బంగారం తరలించే అవకాశాలపై సీబీఐని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అప్రమత్తం చేసిన నేపథ్యంలో సీబీఐ కార్యాచరణకు దిగింది.
దుబాయ్ నుంచి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన రన్యారావును గత సోమవారం రాత్రి డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 14.2 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాను తరచు దుబాయ్, అమెరికా, ఐరోపా వెళ్లేదాన్నని డీఆర్ఏ విచారణలో రన్యా రావు అంగీకరించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో రన్యారావు వెనుక అక్రమ స్మగ్లింగ్ నెట్వర్క్ ఏదైనా ఉందా? అనే కోణం నుంచి ప్రస్తుతం డీఆర్ఐ ఆరా తీస్తోంది. ఆర్థికనేరాల ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో ఆమె ల్యాప్టాప్లు, ఫోన్లు జప్తుచేసుకుని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించింది. ప్రస్తుతం డీఆర్ఐ అధికారుల కస్టడీలోనే ఉన్న రన్యారావును అక్కడి విచారణ అనంతరం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆమె కాల్డేటాలోని వివరాల ఆధారంగా ఢిల్లీ, ముంబయిలోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణాకు సహకరిస్తున్న స్మగర్ల నేషనల్ నెట్వర్క్ను కనిపెట్టడంతో పాటు విమానాశ్రయాల వల్ల వీరికి ఎవరి నుంచి సహకారం అందుతోందనే విషయాలపై సీబీఐ దర్యాప్తు జరుపనుంది. కస్టమ్స్, పోలీస్, విమానాశ్రయ అధికారులతో సహా ప్రభుత్వాధికారుల ప్రమేయంపై ఆరా తీయనుంది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి
ప్రపంచ వృద్ధిని దెబ్బ తీస్తున్న ట్రంప్ విధానాలు