జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వంకు అప్పగింత

జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వంకు అప్పగింత

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు, భూములు, ఆస్తుల పత్రాలు, చీరలు, చెప్పులు సహా ఇతర వస్తువులను తాజాగా శుక్రవారం అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. 

మొత్తంగా 6 ట్రంకు పెట్టెల్లో బెంగళూరు నుంచి చెన్నైకి తీసుకువచ్చిన అధికారులు వాటిని అప్పగించే పనిని పూర్తి చేశారు. ఇన్నేళ్ల పాటు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆ వస్తువులను ఉంచారు. తాజాగా న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో తమిళనాడు అధికారులకు అందించారు.  జయలలిత అక్రమ సంపాదనకు సంబంధించి నమోదైన కేసు ఆమె అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండటంతో 2004లో ఆ కేసును కర్ణాటకకు బదిలీ చేశారు. 

ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న వస్తువులు ఇన్ని సంవత్సరాల పాటు కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచారు. ఆ కేసులో జయలలిత దోషిగా తేలినా  అప్పటికే ఆమె అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆ తర్వాత ఆ ఆస్తులు, వస్తువులు తమకు అప్పగించాలని, జయలలితకు తామే వారసులమని జె.దీపక్, జె.దీప అనే ఇద్దరు వ్యక్తులు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. 

వారి పిటిషన్లను కర్ణాటక హైకోర్టు గతంలోనే కొట్టివేయగా, వారు ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీంతో జయలలిత అక్రమార్జన కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు వారి పిటిషన్లను కొట్టివేస్తూ స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని తీర్పునిచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా ఆ వస్తువులన్నింటినీ 6 ట్రంకు పెట్టెల్లో భారీ భద్రత మధ్య బెంగళూరు నుంచి చెన్నైకి అధికారులు తీసుకువచ్చారు. 

జడ్జి హెచ్‌ఎన్‌ మోహన్‌ సమక్షంలో వాటిని బెంగళూరు అధికారులు తమిళనాడు అధికారులకు అప్పగించారు. అయితే కేసు విచారణ సందర్భంగా ఆ వస్తువులను జప్తు చేసుకున్న సమయంలో వాటి విలువ రూ.913.14 కోట్లుగా అధికారులు లెక్కగట్టారు. కానీ ప్రస్తుతం వాటి విలువ భారీగా పెరిగిందని చెప్పారు. జయలలిత ఆస్తుల విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం కనీసం రూ.4 వేల కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది.

1991-1996 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పని చేశారు. ఆ సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తమిళనాడు అవినీతి నిరోధక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తమిళనాడు ఏసీబీ అధికారులు జయలలిత ఇంటిపై దాడి చేసి బంగారం, వజ్రాల ఆభరణాలు, వెండి వస్తువులు, ఖరీదైన గడియారాలు, చీరలు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు.