
భారతదేశంలో మద్యపానం వినియోగంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా సర్వే చేసింది. ముఖ్యంగా దేశంలోని ఏ రాష్ట్ర మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారో గుర్తించింది. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ఈశాన్య రాష్ట్రాల్లో మందుకొట్టే మహిళలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
సాధారణంగా మెట్రో పాలిటన్ సిటీల్లో, ఉద్యోగం, వ్యాపారాలు చేసే స్త్రీలు ఎక్కువగా మద్యం సేవిస్తుంటారని అంతా అనుకుంటారు. కానీ దీనికి విరుద్ధంగా సర్వే ఫలితాలు వచ్చాయి. పుణే, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నట్లు వెల్లడి అయింది.
మద్యం సేవించే మహిళలు ఎక్కువగా ఉన్న నెంబర్ వన్ రాష్ట్రంగా అస్సాం నిలిచింది. 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతంగా ఉండగా, అస్సాంలో ఆ సగటు 16.5 శాతానికి దగ్గరగా ఉంది. రెండో స్థానంలో మేఘాలయ ఉండగా, సగటు మద్యపాన శాతం 8.7 ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అలాగే మూడో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది.
గతంలో వరుసగా 9.9 శాతం, 9.6 శాతం మహిళల మద్యపాన రేటు ఎక్కువగా ఉన్న జార్ఖండ్, త్రిపుర రాష్ట్రాలు గణనీయమైన తగ్గుదలను చూశాయి. ప్రస్తుతం జార్ఖండ్లో 0.3 శాతం, త్రిపురలో 0.8 శాతం స్త్రీలు మాత్రమే మద్యం సేవిస్తున్నారు. ఇదిలా ఉండగా పురుషులు ఎక్కువగా మందుకొట్టే రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ నెంబర్ వన్లో నిలిచింది. 15-49 ఏళ్ల వయసు కల్గిన పురుషుల్లో 59 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు తేలింది.
More Stories
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం