
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన తెలంగాణ కుంభమేళాగా పేరొందిన గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.
ఈ నెల 12 నుండి 15 వరకు 4 రోజుల పాటు మినీ మేడార జాతర జరగనుంది. బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. అంటే జాతర ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు గుడి మెలిగె, మండ మెలిగె పండుగను నిర్వహిస్తుంటారు. ఈ నెల 12న జాతర ప్రారంభం కానుండటంతో పూజారులు బుధవారం గుడి మెలిగె పండుగకు శ్రీకారం చుట్టారు.
బుధవారం మేడారంలో గల సమక్క ఆలయంలో సిద్ధబోయిన వంశస్థులు, కన్నెపల్లలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు గుడి మెలిగె పండుగను నిర్వహించారు. ఈ గుడి మెలిగె పండుగలో భాగంగా పూజారులు గుడిని శుద్ధి చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి డోలు వాయిద్యాలతో అటవీప్రాంతంలోకి వెళ్లి గుట్టగడ్డిని తీసుకువచ్చారు.
గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనంతరం పూజామందిరాన్ని అలంకరించారు. ఈ మండమెలిగె, గుడి మెలిగె పండుగతో మినీ మేడారం జాతర ప్రారంభమైనట్లేనని పూజారులు వెల్లడించారు. ఇప్పటి నుంచి మినీ జాతర ముగిసే వరకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులను కూడా మోహరించనున్నారు. మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, రవాణా, భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది.
More Stories
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు!
నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు