
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సి వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జ రిగిందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వర్గీకరణ లో తమకు న్యాయం 11 శాతం దక్కాల్సిన వాటా 9 శాతంగా నిర్ణయించడం సరికాదని స్పష్టం చేశారు. జనాభా పంరంగా కాని, వెనకబాటుపరంగా కాని ఎలా చూసినా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు దక్కాలని తేల్చి చెప్పారు.
ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రిజర్వేషన్ల పంపిణీలోని లోపాలను సరిద్దిద్ది ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. 15 లక్షలు ఉన్న మాదిగలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తే, 32 లక్షలకు పైగా ఉన్న మాదిగలకు 11 శాతం రావాల్సిందేనని ఆయన చెప్పారు. వర్గీకరణలో మాలలు కుట్రకు పాల్పడ్డారని, మాదిగలకు రిజర్వేషన్లు తగ్గడానికి వివేక్ వెంకటస్వామి కారణమని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
మాదిగల హక్కులను కాపాడాల్సిన మంత్రి దామోదర రాజనర్సింహ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రాజనర్సింహా మాదిగలకు ప్రతినిధి ఏమాత్రం కాజాలరని, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మాదిగలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సి వర్గీకరణకు సంబంధించి తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పరిశీలించారని చెబుతూ ఆయా రాష్ట్రాల్లో ఎస్సి రిజర్వేషన్లను రెండు గ్రూపులుగానే వర్గీకరించారని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ మాదిగ, మాలలను రెండు గ్రూపులుగా విభజించాలని, ఆలాకాని పక్షంలో నాలుగు గ్రూపులుగా వర్గీకరించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. వర్గీకరణకు షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సు చేయడం, రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించిన మండకృష్ణ, క్రిమిలేయర్కు కమిషన్ చేసిన సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించిందని విచారం వ్యక్తం చేశారు.
ఈనెల 7న ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ’లక్ష డప్పులు, వెయ్యి గొంతులు’ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఆ కార్యక్రమం 15 రోజుల్లోగా నిర్వహిస్తామని, తేదీ, స్థలాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇది సాంస్కృతిక కార్యక్రమమని రిజర్వేషన్ల వర్గీకరణతో దీనికి సంబంధం లేదని పేర్కొంటూ అయినా ప్రభుత్వం అనుమతివ్వలేదని ఆయన ధ్వజమెత్తారు.
More Stories
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు!
నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు