తమిళనాడులో అదనపు డిజిపిపై ఆఫీస్ లోనే హత్యాయత్నం!

తమిళనాడులో అదనపు డిజిపిపై ఆఫీస్ లోనే హత్యాయత్నం!
* ఆలస్యంగా లీక్ అయిన డిజిపికి వ్రాసిన లేఖ
 
తమిళనాడులో పోలీసు ఉద్యోగాల ఎంపికలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకురావటంతో తనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ సీనియర్ మహిళా ఐపీఎస్‌ అధికారి, అదనపు డిజిపి కల్పనా నాయక్‌ డీజీపీ శంకర్‌జివాల్‌కు రాసిన లేఖ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 2024 జూలై 29న నగరంలో ఉన్న తన కార్యాలయం మంటల్లో దగ్ధమైందని, ఆ ఘటన తనను టార్గెట్‌గా చేసుకుని జరిగిన హత్యాయత్నంగా అనుమానిస్తున్నట్లు ఆ లేఖలో ఆమె ఆరోపించారు. 
 
రాష్ట్ర పోలీసు శాఖలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, జైలువార్డెన్‌లు, అగ్నిమాపక సిబ్బంది ఎంపికలో జరిగిన అవకతవకలను బట్టబయలు చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగిందని తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వులను అధిగమించి తాను ఉద్యోగుల ఎంపికను అడ్డుకున్నానని, దాని వలన జరగబోయే అప్రతిష్ట నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడానని, ఆ విషయమే తన ప్రాణాలకు ముప్పు తెచ్చేలా తయారైందని తెలిపారు. 
 
తన గత యేడాది జూలై 29న తాను కొద్ది నిమిషాలకు ముందు కార్యాలయానికి వెళ్ళి ఉంటే ప్రాణాలను కోల్పోయేదని పేర్కొన్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ సంఘటన జరిగింది. ఆ ప్రమాదం జరిగిన మరుసటి రోజే పోలీసుశాఖ ఉద్యోగాల ఎంపిక తన ఆమోదం లేకుండానే జరిగినట్లు ఆమె ఆరోపించారు. సీనియర్‌ పోలీసు అధికారి అయిన తన ప్రాణాలకే భద్రత లేనప్పుడు, సాధారణ పోలీసుల పరిస్థితి ఏమిటి? అని ఆమె ప్రశ్నించారు.
ఈ అగ్ని ప్రమాదం జరిగిన 15 రోజుల తర్వాత అంటే 2024 ఆగస్టు 15న డీజీపీ శంకర్‌జివాల్‌కు ఆమె ఆ లేఖ పంపారు.  ఆ లేఖ ప్రతులను హోంశాఖ కార్యదర్శి, చెన్నై పోలీసు కమిషనర్‌కు కూడా పంపినట్లు ఆమె తెలిపారు. తనపై జరిగిన హత్యాయత్నంపై విచారణ జరపాలంటూ ఆరు నెలల క్రితమే ఆదేశాలున్నప్పటికీ ఆ విచారణకు సంబంధించిన ఫలితాల ఇంకా వెలువడలేదని తెలిపారు.అయితే అడిషనల్‌ డీజీపీ కల్పనానాయక్‌ గదిలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రలు లేవని, ఆ సంఘటన ప్రమాదంగానే భావిస్తున్నామని డీజీపీ శంకర్‌ జివాల్‌ సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఆమె డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారని, అగ్ని ప్రమాదంపై ఎగ్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కూడా జరిపారని తెలిపారు. ఫోరెన్సిక్‌ నిపుణులు, అగ్నిమాపకశాఖ నిపుణులు, విద్యుత్‌ బోర్డు అధికారుల వద్ద అగ్ని  ప్రమాదం గురించిన వివరాలను కూడా సేకరించినట్లు తెలిపారు.