ఫిబ్రవరి 5న ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

ఫిబ్రవరి 5న ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు, ఉత్తరప్రదేశ్, తమిళనాడులలోని ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ఫిబ్రవరి 5న జరగనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఎగ్జిట్‌ పోల్స్‌, ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా జారీచేసింది.  పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురణపై నిషేధం విధించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నది.

పోలింగ్‌ ముగింపు సమయానికి ముందు 48 గంటల పీరియడ్‌లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వార్తలనుగానీ, ఒపీనియన్‌ పోల్‌ వివరాలను గానీ, ఇతర పోల్‌ సర్వేల వివరాలను గానీ ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని కూడా ఈసీ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్‌ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులోని ఈరోడ్‌ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సంపూర్ణ మెజారిటీతో గెలిచింది. 

70 సీట్లలో 2015లో ఆప్‌ 67 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం కాగా, కాంగ్రెస్‌ అసలు ఖాతానే తెరువలేదు. 2020లో కూడా ఆప్‌ హవానే కొనసాగింది. ఆ పార్టీ 62 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ మిగిలిన 8 స్థానాలు దక్కించుకుంది. వరుసగా రెండోసారి కూడా కాంగ్రెస్‌కు రిక్త హస్తమే మిగిలింది.