అండర్-19 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్

అండర్-19 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్

టీమ్ ఇండియా అండర్ 19 అమ్మాయిలు విశ్వ విజేతలుగా నిలిచారు. 2025 అండర్- 19 T20 వరల్డ్​కప్​ టైటిల్ నెగ్గారు.  ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్​లో భారత్ 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి విశ్వ‌విజేత‌గా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్​ కోల్పోయి ఛేదించారు.

గొంగడి త్రిష (44 పరుగులు; 33 బంతుల్లో: 8×4) స్వల్ప ఛేదనలో అదరగొట్టింది. నాటౌట్‌గా నిలిచింది. సనికె చక్లె (26 పరుగులు) రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో రెనెకె 1 వికెట్ దక్కించుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది.

కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పేలవమైన ఆరంభం తర్వాత జట్టు స్కోరు 82 పరుగులకే పరిమితమైంది. 18 బంతుల్లో 23 పరుగులు చేసిన మైకే వాన్ వూర్స్ట్ దక్షిణాఫ్రికా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచారు. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 11.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు, సానికా చాల్కే 22 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఓపెనర్ జి కమలిని (8) వికెట్ కోల్పోయింది. ఈ టోర్నీలో తెలుగమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా రాణించింది. ఇప్పటికే టోర్నీలో సెంచరీ బాదేసింది. ఫైనల్​లోనూ  బ్యాటింగ్‌లో 44 పరుగులు అద్వితీయ ఇన్నింగ్స్ ఆడటమే గాక బౌలింగ్‌లో 15 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శన చేసింది.

 భారత్ చాంపియన్‌గా నిలవడంలో త్రిష కీలక పాత్ర పోషించింది. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడంతోపాటు.. బ్యాటింగ్‌లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ తెలుగుమ్మాయే నిలిచింది.  స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ త్రిష అజేయ శతకం బాదడంతోపాటు 6 పరుగులకే 3 వికెట్లు తీసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సత్తా చాటింది.

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్.. వరుసగా ఏడు మ్యాచ్‌లలో గెలిచింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది. ఆ తర్వాత మలేషియా, శ్రీలంక జట్లను ఓడించి సూపర్‌ సిక్స్‌కు చేరింది. సూపర్‌ సిక్స్‌ స్టేజ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లను ఓడించింది. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఇక తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించింది.

గతసారి ఇంగ్లండ్‌ను ఓడించి తొలి ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. కాగా పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లోనూ భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే. ఇక మహిళల జట్టు కూడా అదే జట్టుపై విజయం సాధించింది.