పోలవరం నిర్మాణం సవరించిన అంచనాకు ఆమోదం

పోలవరం నిర్మాణం సవరించిన అంచనాకు ఆమోదం

* వికసిత్ భారత్‌ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్‌.. చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేందుకు సవరించిన అంచనాల మేరకు రూ.30,436.95 కోట్లతో నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రకటించారు.

ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన బ్యాలెన్స్ గ్రాంట్‌ రూ.12157.53 కోట్లు అని నిర్ధారించింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5936 కోట్లు కేటాయించినట్లు వివరించింది. అయితే గతేడాది కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన బడ్జెట్ ప్రసంగంంలో కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కేటాయింపును ఆమె గణాంకాలతో సహ వివరించారు. అందులో భాగంగా గతంలో ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిధుల వివరాలను తెలిపారు. 

ఈ పోలవరం ప్రాజెక్టు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌ హోదా కల్పించిన విషయం విధితమే.గత దశాబ్ద కాలంగా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నా ఐదేళ్ల వైసిపి హయాంలో నిర్మాణం కుంటుపడింది.  2024లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఘన విజయం సాధించగానే ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది కంటే రూ.400 కోట్లు అధికంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. మొత్తంగా రూ.5,936 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. విశాఖ పోర్టుకు కూడా గతేడాదితో పోలిస్తే రూ.445 కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపింది. మొత్తంగా విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారని చంద్రబాబు కొనియాడారు. వికసిత్ భారత్‌ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్‌ ఉందని ప్రశంసించారు. మహిళా, పేదల, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసిందని తెలిపారు. 

రానున్న ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శకతం చేస్తోందని చంద్రబాబు తెలిపారు. జాతీయ సౌభాగ్యానికి ఈ బడ్జెట్ ఓ ముందడుగు అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌కు ఈ బడ్జెట్‌ బ్లూ ప్రింట్ లాంటిదన్నారాయన. మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్‌, ఈ బడ్జెట్‌లో వచ్చిన అదనపు ప్రయోజనం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఏపీకి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రజల తరఫున నిర్మల సీతారామన్‌కు కృతజతలు తెలిపారు. లాజిస్టిక్ హబ్‌గా ఏపీని అభివృద్ధి చేస్తామని అన్నారు. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ తారునీరు అందిచాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల అని తెలిపారు. 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపుతో ఏపీకి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. అమరావతికి వచ్చే నాలుగేళ్లలో కూడా నిధులు వస్తాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు.

ఏపీలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు 

  • పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
  • విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు
  • విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
  • జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు
  • ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు
  • లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు
  • ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు
  • ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు