బాలీవుడ్‌ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు  ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ వరుస బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. 

ఇంతలోనే పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మతోపాటు రాజ్‌పాల్‌ యాదవ్ ()‌, రెమో డిసౌజా, సుగంధ మిశ్రాలకు హత్య బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తాజాగా తెలిపారు. బిష్ణు అనే పేరుతో వీరికి బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. 

కాగా, బెదిరింపు మెయిల్‌లో ‘మేము మీ ప్రతి కదలికను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ లేదా మిమ్మల్ని వేధించే ప్రయత్నం అయితే కానే కాదు. మీరు ఈ సందేశాన్ని సీరియస్‌గా తీసుకోండి’ అంటూ ఈ-మెయిల్లో పేర్కొన్నట్టు పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.

బెదిరింపు మెయిల్‌ పంపిన వ్యక్తి తన డిమాండ్లను ఎనిమిది గంటల్లోగా నెరవేర్చకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించినట్లు తెలిసింది. అయితే ఆ వ్యక్తి డిమాండ్లు ఏంటన్నవి మాత్రం ఇంకా బయటకు రాలేదు. 

ప్రముఖుల ఫిర్యాదు మేరకు అంబోలి, ఓషివారా పోలీస్‌ స్టేషన్లలో కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఈ మెయిల్‌ ఐపీ అడ్రస్‌ పాకిస్థాన్‌కు చెందినదిగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ మేరకు తదుపరి విచారణ కొనసాగుతోంది.

బెదిరింపుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, కపిల్ శర్మతో పాటు ఇతరులకు ప్రత్యేక భద్రత కల్పించామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కపిల్ శర్మ కామెడీ షోల ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్’, ‘కామెడీ నైట్స్’ వంటి షోలతో ఆయన పేరు ప్రఖ్యాతలు పొందాడు. పలు సినిమాల్లోనూ నటించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.