
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్లు గెలవడమే నగర బిజెపి సభ్యుల లక్షం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కోరారు. ప్రజలు ఆప్ ప్రభుత్వంపై బాహాటంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆ పార్టీ వాగ్దానాలను వారు దానికి గుర్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ బిజెపి సభ్యులతో ఆన్లైన్లో మోదీ మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుట్టు బట్టబయలైందని పేర్కొన్నారు. ఆయన ఆ పార్టీని ‘ఆపద’గా పేర్కొన్నారు.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే సమాచారాన్ని రోజూ అందుకుంటున్నందున ‘ఆపద’ ప్రతి రోజు కొత్త ప్రకటనలు చేస్తున్నదని ఆయన తెలిపారు. ‘పూర్వాంచల్’ ప్రాంతానికి చెందిన ప్రజలను దేశ రాజధాని నుంచి నెట్టివేయడానికి ఆప్ కుట్ర పన్నుతోందని, ఆ పార్టీకి వారిపై నిలువెల్లా ద్వేషం ఉందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ అబద్ధాలు, వంచనల్లో నిమగ్నమైందని, అది, కాంగ్రెస్ గత 25 ఏళ్లుగా భారీ ఎత్తున ప్రజలను నమ్మకద్రోహం చేశాయని ప్రధాని విమర్శించారు.
గడచిన 25 ఏళ్లలో లేదా 35- 40 వయోవర్గంలో ఉన్నవారు విధ్వంసం తప్ప మరేమీ చూడలేదని, వారు ఆశ కోల్పోయారని, నిస్పృహలో ఉన్నారని మోదీ పేర్కొన్నారు. కేజ్రీవాల్పై మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, ఆప్ వంచనకు, అబద్ధాలకు ‘శీష్మహల్’ (అద్దాలమేడ) ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేజ్రీవాల్ తన కోసం కోట్లు వెచ్చించి ‘శీష్ మహల్’ నిర్మించుకుకున్నారని, ఆప్ మోసాలు, నయవంచనకు ఇదే నిదర్శనమని చెప్పారు. కేజ్రీవాల్ అధికార నివాసాన్ని అద్దాలమేడగా బిజెపి అభివర్ణించింది. ఆ ఇంటిపై ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని బిజెపి ఆరోపించింది.
కేజ్రీవాల్ సారథ్యంలోని పార్టీని ఓడించాలని ప్రధాని పిలుపు ఇస్తూ, అభివృద్ధి చెందిన భారత్కు అభివృద్ధి చెందిన రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి మార్గాన్ని అది సుగమం చేస్తుందని ఆయన చెప్పారు. ప్రజలకు నీరు వంటి కనీస అవసరాలను తీర్చడంలో నగర ప్రభుత్వం ‘విఫలమైంద’ని మోదీ విమర్శించారు.
‘మద్యం దొరుకుతోంది గానీ నీరు లభ్యం కావడం లేదు’ అన్న బిజెపి సభ్యుడు ఒకరితో మాట్లాడుతూ మోదీ ఆ విమర్శ చేశారు. ఆప్ బోగస్ ప్రకటనలు మాత్రమే చేస్తున్నదని, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని బిజెపి మెరుగుపరుస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు. తమ బూత్ కార్యకర్తల బలం ఆధారంగానే బిజెపి అఖండ విజయం సాధిస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు పార్టీ ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారని మోదీ తెలిపారు.
బీజేపీని ఎన్నుకుంటే ఇంటింటికి తాగునీరు సౌకర్యం కల్పిస్తామనే భరోసాను కార్యకర్తలు ప్రజలకు చేరవేయాలని ప్రధాని కోరారు. దయనీయమైన రోడ్లు, డ్రైనేజీ, అపరిశుభ్రతతో ఢిల్లీ ప్రజలు పడుతున్న అవస్థలు, ఈ దిశగా ఆప్ వైఫల్యాన్ని ఎండగట్టాలని ఆయన సూచించారు. విద్యుత్ బిల్లులు పెరగడానికి కూడా ఆప్ ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు.
యుమునా నదీ ప్రక్షాళలను వాగ్దానం చేసి విఫలమైన ఆప్ ఇప్పుడు కొత్త వాగ్దానాలిస్తోందని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని విఫలమైందని, కేంద్రం పేదల కోసం వేలాది ఇళ్లు కట్టించిందని చెప్పారు. మధ్యతరగతి ప్రజానీకం స్థితిగతుల మెరుగుకు బీజేపీ కట్టుబడి ఉందని, మెట్రో, హైవేల నిర్మాణానికి భారీగా ఖర్చు చేసిందని చెప్పారు. లక్షలాది మంది ఢిల్లీ ప్రజలతో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఫేట్ను 8వ పే కమిషన్ మారుస్తుందని భరోసా ఇచ్చారు.
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి మోదీ స్వాగతం!
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్